(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: కాపులకు ప్రత్యేక రిజర్వేషన్లు కోరుతూ ఉద్యమిస్తున్న కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు కీలక సమావేశం జరపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, బిజెపి, జనసేన పొత్తుపై ఇరువురు చర్చలు జరిపినట్లు సమాచారం.
కాపు ఉద్యమ నేతగా పట్టు ఉన్న ముద్రగడ ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీతో అనుబంధంగా లేరు. రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న బిజెపి.. కాపు ఉద్యమ నేతగా పేరున్న ముద్రగడను పార్టీలోకి చేర్చుకుంటే కోస్తాంధ్రలో బిజెపికి మరింత బలం పెరుగుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో బిజెపి దోస్తీ అయిన తరువాత ముద్రగడతో వీర్రాజు సమావేశం కావడం రాజకీయ ప్రాముఖ్యతను సంతరించుకున్నది.