టీవీ స్టూడియోలలో చర్చల సమయంలో ఆయన తన వన్ లైనర్లతో పంచ్ వేస్తుంటారు. వృత్తిరీత్యా వైద్యుడు, ప్రవృత్తి రీత్యా రాజకీయ నాయకుడైన సంబిత్ పాత్రా.. ప్రస్తుతం ఒడిశాలోని పూరి లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా తనలోని కళలను ప్రదర్శించడం ఆయనకు అలవాటు. అందుకే పూరీలో జరిగిన ఓ ఎన్నికల సభలో ఆయన మైకు ముందుకొచ్చి ఉన్నట్టుండి ‘తెలుసా.. మనసా.. ఇది ఏనాటి అనుబంధమో’ అనే పాట అందుకున్నారు. తెలుగువాళ్లు ఎక్కువగా ఉండే పెంతకాట ప్రాంతంలో ఆయన ఈ పాట పాడారు. క్రిమినల్ సినిమాలోని ఈ పాట అప్పటి నుంచి ఇప్పటివరకు బాగా ప్రాచుర్యం పొందింది. దాంతోపాటు మెగాస్టార్ చిరంజీవి నటించిన ఘరానామొగుడుసినిమాలోని ‘బంగారు కోడిపెట్ట’ పాటను కూడా అలవోకగా పాడేశారు.
Puri has a sizeable Telugu Population as well. While Campaigning amidst them sang a famous Telugu number on demand. The frenzy in the crowd was palpable, don’t believe ? A must watch! Lots of love to my adorable Telugu friends. @BJP4Odisha #IndiaBoleModiDobara #SambitPatra4Puri pic.twitter.com/ULI8xJdnhU
— Sambit Patra (@sambitswaraj) April 19, 2019
తర్వాత తన పాటలను ఆయన ట్విటర్ లో కూడా అప్ లోడ్ చేశారు. పూరీలో తెలుగు జనాభా కూడా చాలా ఎక్కువగానే ఉందని అందులో అన్నారు. వాళ్ల ప్రాంతంలో ప్రచారం చేసేటపుడు వాళ్ల డిమాండు మేరకు తెలుగు పాటలు పాడానని, దానికి ప్రజలు కూడా బాగా స్పందించారని చెప్పారు. ‘‘నమ్మలేరా.. అయితే చూడండి నా ప్రియమైన తెలుగు స్నేహితులకు బోలెడంత ప్రేమ’’ అని అన్నారు. పాట మధ్యలో ఒక పదం హిందీలో కూడా పాడి, మళ్లీ తెలుగులోకి వచ్చేశారు. దానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. వాళ్లు కరతాళ ధ్వనులతో ప్రోత్సహించడంతోపాటు చాలామంది తమ సెల్ ఫోన్లలోనూ ఆయన పాటను బంధించారు. ఇక చిన్నారి వెంకటేశ్ అనే అభిమాని అయితే ‘‘నా ప్రియమైన రాజకీయ నాయకుడు డాక్టర్ సంబిత్ పాత్రా సర్’’ అని కేప్షన్ పెట్టి ఫేస్ బుక్ లోనూ దాన్ని పోస్ట్ చేశారు. తన పార్టీలో సంబిత్ పాత్రాజీ లాంటి బహుముఖ ప్రతిభ ఉన్న వ్యక్తులు ఉన్నందుకు గర్వపడుతున్నానని దీపాంకర్ డే అనే యూజర్ వ్యాఖ్యానించారు.
పూరీ లోక్ సభ ఎన్నికలు ఈనెల 23న మూడోదశలో జరగనున్నాయి. ఆ స్థానంలో బీజేడీ తరఫున పినాకి మిశ్రా, కాంగ్రెస్ తరఫఉన సత్యప్రకాష్ నాయక్ పోటీలో ఉన్నారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి కూడా అయిన సంబిత్ పాత్రా.. నామినేషన్ల దాఖలు కోసం పూరీలో కాలు మోపినప్పటి నుంచి సందడి చేస్తున్నారు. ఒడియా మహిళ ఒకరు కట్టెల పొయ్యి మీద తనకు రొట్టెలు చేసి పెడుతున్న వీడియోను పోస్ట్ చేయడంతో, ఉజాలా స్కీం ఫలితం ఇదేనా అన్న విమర్శలు వచ్చాయి. ప్రజలతో కలిసి భోజనం చేసే ఫొటోలు చాలా పెట్టడంతో ఆయన ఎప్పుడూ బయట జనం ఇళ్లలోనే తింటారా అని వ్యాఖ్యానించారు. ఎవరెంత విమర్శించినా ఆయన మాత్రం వెనకడుగు వేయడం లేదు. జగన్నాథుడి విగ్రహాన్ని తీసుకుని ఊరేగింపుగా వెళ్లి చెరువులో స్నానాలు చేయించడం, యువతతో కలిసి విందుల్లో పాల్గొనడం, పంట కోసి తన భుజాల మీద మోయడం.. ఇలా అన్ని రకాలుగా ప్రచారంలో ఉండేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.
గత కొన్ని ఎన్నికలుగా ఇక్కడ వరుసగా బీజేడీ అభ్యర్థులే గెలుస్తున్నందున సంబిత్ పాత్రా విజయం అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకుడు రవిదాస్ అన్నారు. కానీ, సంబిత్ పాత్రా విభిన్న ప్రచారశైలి చూస్తుంటే మాత్రం పినాకి మిశ్రాకు ఈసారి గట్టి పోటీ తప్పదనే అనిపిస్తోందని తెలిపారు. పినాకి వెనుక వ్యవస్థీకృతమైన శక్తి ఉండచ్చు గానీ, పాత్రా మాత్రం చాలా హడావుడి చేస్తున్నారని, లోక్ సభ ఎన్నికలలో ఇది ముఖ్యమని దాస్ వివరించారు.