న్యూస్ ఆర్బిట్ డెస్క్
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్పై లైంగిక వేధింపుల ఆరోపణ వచ్చిన దరిమిలా శనివారం ఉదయం సుప్రీంకోర్టు ధర్మాసనం ఒకటి విచారణకు కూర్చోవడం, దానికి ప్రధాన న్యాయమూర్తి స్వయంగా నేతృత్వం వహించడం న్యాయవర్గాలను విస్మయానికి గురిచేసింది.
శనివారం నాటి పరిణామాలు ప్రాధమిక న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని పలువురు న్యాయకోవిదులు అభిప్రాయపడ్డారు. ప్రముఖ సీనియర్ న్యాయవాది, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు దుష్యంత్ దవే ‘ద హిందు’ దినపత్రికలో ఒక వ్యాసం రాశారు. ‘యువర్ లార్డ్షిప్స్, మీకు నచ్చినా నచ్చకపోయినా, న్యాయవ్యవస్థలో భాగం అయివుండీ మీరు ఇలాంటి చర్యల వల్ల న్యాయవ్యవస్థ స్వతంత్రతను తీవ్రంగా దెబ్బ తీశార’, అని ఆయన ఆ వ్యాసంలో రాశారు.
దుష్యంత్ దవే లేవనెత్తిన కొన్ని అంశాలు…
ధర్మాసనం పరిశీలించాల్సిన అంశమేదీ అక్కడ లేదు. ధర్మాసనం ముందు ఎలాంటి పిటిషన్ లేదు. న్యాయవ్యవస్థ ప్రతిష్టను కాపాడడం కోసం అని ధర్మాసనం చెప్పినట్లు ఆ బాధ్యతను నెత్తిన వేసుకోవాల్సిన అవసరమే అక్కడ కనబడలేదు.
ధర్మాసనంలో ముగ్గురు న్యాయమూర్తులు ఉండగా ఇచ్చిన ఉత్తర్వులో ఇద్దరు న్యాయమూర్తుల పేర్లే ఎందుకు ఉన్నాయి? ఒక జడ్జి తనపై వచ్చిన ఆరోపణలను తానే విచారించకూడదు అన్న ధర్మసూత్రం కోసమా? మరి దానికి ముందు ధర్మాసనం ముందు జరిగిందేమిటి?
మీడియా తన పని తను చేసుకోకుండా ఆపే ఆధికారం సుప్రీంకోర్టుకు లేదు. సలహాలు ఇచ్చే అధికారం అసలే లేదు (న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసే పసలేని ఆరోపణలు ప్రచురించవద్దనీ, అలాంటివాటిని తొలగించాలనీ మీడియాను ధర్మాసనం కోరింది). రాష్ట్రపతి కోరిన పక్షంలో తప్ప సలహాదారుగా వ్యవహరించే న్యాయపరిధి సుప్రీంకోర్టుకు లేదు.
శనివారం నాటి పరిణామాలు మొత్తం స్వతంత్ర మీడియాను లొంగతీసి ప్రజాస్వామ్య మనుగడకు సంబంధించి చాలా ముఖ్యమైన ఒక అంశం మీడియాలో రాకుండా చేసేందుకు ఉద్దేశించినవి.
సుప్రీంకోర్టు ముందు ఉన్న కేసుల్లో అందరికన్నా పెద్ద కక్షిదారు ప్రభుత్వం అయినపుడు ఈ విషయంలో ధర్మాసనం ముందు మాట్లాడడానికి అటార్నీ జనరల్కు ఎలా అనుమతి ఇస్తారు.
2018 జనవరి 12న నలుగురు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు (జస్టిస్ గొగోయ్తో సహా) దేనినయితే బహిరంగంగా వ్యతిరేకించారో ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి అదే పని చేయడం అన్నిటికన్నా విచారకరం. ప్రధాన న్యాయమూర్తి తనకు కావాల్సిన పద్ధతిలో బెంచ్లు ఏర్పాటు చేయడాన్ని అప్పుడు ఆ నలుగురు న్యాయమూర్తులూ వ్యతిరేకించారు. పైగా ఇప్పుడు సెలవురోజైన శనివారం బెంచ్ ఏర్పాటు చేశారు.
జస్టిస్ గొగోయ్ ధర్మాసనంలో కూర్చోవడం ఏ విధంగానూ సమర్ధనీయం కాదని మరో ఇద్దరు ప్రముఖ న్యాయవాదులు బృందా గ్రోవర్, ఇందిరా జైసింగ్ స్పష్టం చేశారు.