సీటు మార్చమని అడిగా..
ఒక రోజు సెలవు తీసుకున్నా
సీజేఐ మీద ఆరోపణలు చేసిన మహిళ
న్యూఢిల్లీ: తనను ఉద్యోగం నుంచి తొలగించడానికి విచారణాధికారి ప్రధానంగా రెండు కారణాలు చెప్పారని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ మీద చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలలో 35 ఏళ్ల జూనియర్ కోర్టు అసిస్టెంట్ (జేసీఏ) తెలిపింది. అవి.. అడ్మిన్ మెటీరియల్ విభాగంలో తన సీటు మార్చడానికి బ్రాంచి ఆఫీసరుకు చెప్పించేందుకు సుప్రీంకోర్టు అధికారిని ఒకరిని కలవడం, స్కూల్లో తన కుమార్తె ఎగ్జిబిషన్ కోసం వెళ్లేందుకు ఒక రోజు విధులకు హాజరు కాకపోవడం. 2014 మే నెలలో సుప్రీంకోర్టులో జేసీఏగా చేరిన ఆమె… కోర్టులోని తొమ్మిది మంది అధికారుల పేర్లను తన ఫిర్యాదులో పేర్కొంది. వారితో పాటు విధుల తర్వాత సీజేఐ గొగోయ్ సూచనల మేరకు సమీపంలోని మెట్రో స్టేషన్ వద్ద దింపే డ్రైవరు, తన కుటుంబం గురించి పోలీసు విచారణ గురించి చెప్పిన ఇద్దరు పొరుగువారిని కూడా ప్రస్తావించింది.
విచారణ సమయంలో తనను రాంమనోహర్ లోహియా ఆసుపత్రికి తీసుకెళ్లిన సమయం, అలాగే తనను ఉద్యోగం నుంచి తొలగించిన తర్వాత ఎయిమ్స్ లోని న్యూరాలజిస్టు వద్ద పొందిన కన్సల్టేషన్ వివరాలనూ ఫిర్యాదుతో పాటు జతచేసింది. సీజేఐ తన ఇంటి వద్ద ఉన్న కార్యాలయంలో 2018 అక్టోబరు 10, 11 తేదీలలో తనను అసభ్యంగా తాకారని, కౌగలించుకున్నారని తన 28 పేజీల ఫిర్యాదులో ఆరోపించింది. ఆ ఘటన తర్వాత తనను పలుమార్లు బదిలీ చేశారని, డిసెంబరు 21న తన పోస్టింగుల మార్పు విషయంలో సీనియర్ అధికారుల నిర్ణయాలను ప్రశ్నించినందుకు సస్పెండ్ చేశారని తెలిపింది.
ఆ ఘటన తర్వాత తనకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీలోని అడ్మిన్ శాఖలో ఓ అధికారి నుంచి, మరో సీనియర్ అధికారి నుంచి చాలా ఫోన్లు వచ్చాయని కూడా ఆరోపించింది. ‘‘అదే రోజు రాత్రి నేను కాస్త తెలివిలోకి వచ్చి, స్పష్టంగా ఆలోచించి సీజేఐకి ఫోన్ చేశాను. ఇక ఆయనతో పనిచేయలేనని చెప్పాలనుకున్నాను. కానీ ఆయన నా ఫోన్ ఎత్తలేదు. రాత్రిపూట జస్టిస్ గొగోయ్ ని ఇబ్బంది పెట్టవద్దని చెప్పడానికి ఆయన వ్యక్తిగత కార్యదర్శి నాకు ఫోన్ చేశారు. అంతకుముందు ఆయన అర్ధరాత్రి సమయాల్లో ఫోన్లు, వాట్సాప్ చేస్తూనే ఉండేవారు’’ అని ఆమె చెప్పింది. 2016 అక్టోబరులో జస్టిస్ గొగోయ్ కార్యాలయంలో పనిచేసే జేసీఏ తన పెళ్లి కోసం సెలవులో వెళ్లడంతో తనను అక్కడ పనికి పంపారని ఆమె తెలిపింది. జస్టిస్ గొగోయ్ 2018 జులై 31న తన భర్తతో కలిసి వచ్చి కలవాల్సిందిగా జస్టిస్ గొగోయ్ చెప్పారంది. ఒకరోజు ఉదయం జస్టిస్ గొగోయ్ తనను ఆయన చాంబర్ లోకి పిలిచారని, ఎందుకు తన ఫోన్ ఆన్సర్ చేయడంలేదని అడిగారని చెప్పింది. తన ఫోనులోని కాల్ లాగ్స్ కూడా చూపించేలా బలవంతం చేశారంది.
తన ఫోనులో తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ బ్లాక్ అవుతాయని చెప్పడంతో, అది నిజమా కాదా అని తేల్చుకోడానికి తన ఎదుటే ఫోన్ చేశారని జేసీఏ తెలిపింది. అది నిజమని తేలడంతో తన నంబరు సేవ్ చేసుకొమ్మని చెప్పారంది. తనను ఆఫీసు గదిలోకి పిలిపించుకుని ఇద్దరి మధ్య జరిగిన వాట్సాప్ చాటింగులను డిలీట్ చేయించేవారని చెప్పింది. అత్యంత రహస్యమైన పనుల గురించి కూడా వాట్సాప్ ద్వారా సూచనలు ఇచ్చేవారు కాబట్టి అవి తన ఫోనులో ఉండకూడదని ఆయన అనుకునేవారేమోనని భావించానంది. ఆ ఒక్కటి తప్ప తన పనిని బాగా ప్రోత్సహిస్తూ సహకరించేవారని తెలిపింది.
కాగా, తమకు నాలుగు మీడియా సంస్థల నుంచి ఈమెయిళ్లు వచ్చాయని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ చెప్పారు. అవి లీఫ్ లెట్, ద వైర్, కారవాన్, స్క్రోల్.ఇన్ అని చెప్పారు. 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని అవి కోరాయని, దాంతో వాటికి సమాధానంగా ఆరోపణలను ఖండించి, పూర్తిగా తప్పు, నిరాధారమని చెప్పామని అన్నారు. సీజేఐ ఇంటివద్ద ఉండే కార్యాలయంలో ఎప్పుడూ కనీసం ఐదారుగురు ఇతర ఉద్యోగులు కూడా ఉంటారని చెప్పారు. అక్కడ ఆమె చాలా తక్కువ కాలమే పనిచేశారని, ఆమె విధుల తీరును బట్టి చూస్తే అసలు ఆమె ప్రత్యక్షంగా సీజేఐతో మాట్లాడే అవకాశమే లేదని తెలిపారు.