మీరు పోలింగ్ కేంద్రానికి వెళ్లినపుడు మీ పేరు జాబితాలో లేకపోతే మీ ఆధార్ కార్డు చూపించి సెక్షన్ 49ఎ కింద ఛాలెంజ్ వోటు వేయవచ్చు.
మీరు పోలింగ్ కేంద్రానికి వెళ్లేసరికే మీ వోటు ఎవరో వేసి ఉంటే టెండర్ వోటు డిమాండ్ చేసి వోటు చేయవచ్చు.
ఏ పోలింగ్ కేంద్రంలోనైనా 14 శాతం కన్నా ఎక్కువ టెండర్ వోట్లు నమోదయితే అక్కడ రీపోలింగ్ జరపాల్సి ఉంటుంది.
ముఖ్యమైన ఈ మెసేజ్ని వీలైనంతమందికి పంపించి వోటు వేసేందుకు వారికున్న హక్కును గుర్తు చేయండి.
ఇండియా సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ పై మెసేజ్ సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
ఫేస్బుక్లో కూడా చాలామంది దీనిని పోస్టు చేస్తున్నారు.
ఈ మెసేజ్లో నిజమెంతో పరిశీలిద్దాం.
ఛాలెంజ్ వోటు:
1961 ఎన్నికల నిర్వహణ నిబంధనలలోని 49ఎ సెక్షన్కూ ఛాలెంజ్ వోటుకూ ఎలాంటి సంబంధం లేదు. ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాల డిజైను గురించి సెక్షన్ 49ఎ చెబుతుంది.
మరి ఛాలెంజ్ వోటు అసలు ఉందా?
సెక్షన్ 49జె దీని గురించి చెబుతుంది. ఎవరైనా వోటరు గుర్తింపు గురించి పోలింగ్ ఏజెంట్ అభ్యంతరం చెప్పిన పక్షంలో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చేయాలో సెక్షన్ 49జె చెబుతుంది. ఆ వోటరు వివరాలు ఫారం 14లో నింపిన తర్వాత ప్రిసైడింగ్ అధికారి విచారణ జరిపి తాను సంతృప్తి చెందితే ఆ వోటరుకు వోటుహక్కు కల్పించాలని ఆ సెక్షన్ చెబుతోంది.
టెండర్ వోటు:
పోలింగ్ నిబంధనల ప్రకారం టెండర్డ్ వోటు అనేది ఉంది. ఎవరైనా వోటరు తాను వెళ్లేసరికే మరొకరు తన వోటు వేసుంటే సెక్షన్ 49పి కింద టెండర్డ్ వోటు కోరవచ్చు. ఫారం 17బిలో ఆ వోటరు వివరాలు నమోదు చేసి ప్రిసైడింగ్ అధికారి వోటరుకు వోటుహక్కు కల్పించవచ్చు. అయితే మరీ తక్కువ తేడాతో ఫలితం నిర్ణయమైనపుడే ఈ టెండర్డ్ వోట్లను లెక్కిస్తారు.
రీపోలింగ్:
ఏదైనా పోలింగ్ కేంద్రంలో 14శాతం కన్నా ఎక్కువ టెండర్ వోట్లు నమోదైన పక్షంలో అక్కడ రీపోలింగ్ జరపాలని ఎన్నికల నిబంధనావళిలో ఎక్కడా లేదు. 14 శాతం అన్న మాటే కల్పితం. ఎక్కడైనా బోగస్ వోట్లు ఎక్కువ సంఖ్యలో నమోదయ్యాయని ఎన్నికల కమిషన్ భావించిన పక్షంలో అక్కడ రీపోలింగ్ జరిపిస్తారు. అది పూర్తిగా ఎన్నికల కమిషన్ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది.
వోటర్లు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే వోటరుగా నమోదు కావడం అన్నది అన్నిటికన్నా ముఖ్యం. ఆ తర్వాత తమ వోటు జాబితాలో ఉందీ లేనిదీ అప్పుడప్పుడూ చూసుకుంటూ ఉండడం మంచిది. వోటర్ల జాబితాలో పేరు ఉండీ వోటరు ఐడి కార్డు లేని పక్షంలో ఆధార్, పాన్, డ్రయివింగ్ లైసెన్స్, పాస్పోర్టు వంటివి చూపించి వోటు వేయవచ్చు.
ఆల్ట్ న్యూస్ సౌజన్యంతో