న్యూఢిల్లీ: తుపాకితో బెదిరించి కోడలిమీద అత్యాచారానికి పాల్పడిన ఆభియోగంపై బిజెపి మాజీ ఎమ్మెల్యే మనోజ్ షోకీన్పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. నంగ్లోయి అసెంబ్లీ సీటు నుంచి మనోజ్ రెండు సార్లు ఎన్నికయ్యాడు. ఆయన కుమారుడి భార్య గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
2018 డిసెంబర్ 31 అర్ధరాత్రి న్యూఇయిర్ వేడుకల నుంచి భర్త తనను ఇంటి దగ్గర దింపి బయటకు వెళ్లాడనీ, తర్వాత ఈ సంఘటన జరిగిందనీ ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నది. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం ఆరోజు అర్ధరాత్రి 130 గంటల సమయంలో మనోజ్ వచ్చి కోడలి గది తలుపు తట్టాడు. తలుపు తీసిన ఆమెను అసభ్యంగా తాకడం మొదలుపెట్టాడు. కోడలు గొడవ చేయడంతో చెంప దెబ్బ కొట్టి తుపాకీ బయటకు తీశాడు. అరిస్తే ఆమె తమ్ముడిని చంపుతానని బెదిరించాడు. బలవంతాన లొంగదీసుకున్నాడు.
కాపురం ఎక్కడ కూలుతుందోనన్న భయంతో వెంటనే ఫిర్యాదు చేయలేదని ఆమె తెలిపింది. సాకేత్ కోర్టులోని మహిళలపై నేరాల విభాగంలో గతంలో అత్తమామలపై గృహహింస ఫిర్యాదు చేసినట్లు కూడా ఆమె చెప్పింది. బుధవారం తన స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు సాకేత్ కోర్టుకు వెళ్లినపుడు అక్కడి సంబంధిత అధికారి తనకు దైర్యం చెప్పాడనీ, దానితో ఫిర్యాదుకు ముందుకు వచ్చాననీ ఆమె పోలీసులకు తెలిపింది. ఐపిసి 376, 506 సెక్షన్ల కింద మనోజ్ షోకీన్పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.