(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 200లకు పైగా ఛారిటబుల్ ట్రస్ట్ల గుర్తింపులను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. విదేశాల నుండి వస్తున్న విరాళాల వివరాలు, ఖర్చులను వెల్లడించకపోవడం వల్ల వారి గుర్తింపును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే విదేశాల నుండి పెద్ద ఎత్తున విరాళాలను సేకరిస్తూ వాటి ద్వారా ఛారిటబుల్ ట్రస్ట్లు మతమార్పిడులను ప్రోత్సహిస్తున్నాయన్న ఆరోపణల నేపధ్యంలోనే కేంద్రంలోని బిజెపి రాజకీయ కోణంలోనే వీటిపై దృష్టి పెట్టిందనే మాట వినబడుతోంది.
ఆంధ్రప్రదేశ్లో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపిలను బలహీనపర్చి రాబోయే ఎన్నికల నాటికి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బిజెపి ఆకాంక్షిస్తున్నది.
హిందూత్వ ఏజండాతో ఉత్తరాది రాష్ట్రాల్లో బలం పెంచుకున్న బిజెపి దక్షిణాదిలో పాగా వేయడానికి కూడా మతపరమైన అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏపి ముఖ్యమంత్రి ప్రాధమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దీనికి మతాన్ని జోడిస్తూ విమర్శించిన విషయం తెలిసిందే. ఇంగ్లీషు మాధ్యమం అమలు విషయంలో మతపరమైన కుట్ర దాగి ఉందంటూ ఆయన విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్లో వైసిపికి పూర్తి స్థాయిలో క్రైస్తవులు అండదండగా ఉన్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బిజెపి రాష్ట్రంలో మత మార్పిడిలను కట్టడి చేయాలని ఆలోచన చేస్తున్నదా? అందుకే క్రైస్తవ స్వచ్చంద సంస్థలపై దృష్టి సారించిందా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. వివిధ బలహీన వర్గాలతో పాటు క్రైస్తవులకు వైసిపి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని ప్రచారం జరుగుతున్నది. అందులో భాగంగానే గతంలో ఎన్నడూ లేని విధంగా పాస్టర్లకు గౌరవ వేతనం ప్రకటించారని చెపుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విదేశీ నిధులతో మత మార్పిడులను ప్రోత్సహించే స్వచ్చంద సంస్థలను కట్టడి చేయాలని నిర్ణయం తీసుకుందని అనుకుంటున్నారు. అందులో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న సుమారు 200లకు పైగా స్వచ్చంద సంస్థలను గుర్తింపును రద్దు చేసింది.
ఆంధ్రప్రదేశ్లో అధికంగా 168, తెలంగాణలో 90కి పైగా స్వచ్చంద సంస్థలు గుర్తింపు రద్దు అయిన జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో 90శాతం క్రిస్టియన్ మతానికి చెందినవేనని సమాచారం. గుర్తింపు రద్దు చేసిన సంస్థల జాబితాలో ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తల్లి విజయమ్మ పేరుతో ఏర్పాటు చేసిన ఛారిటబుల్ ట్రస్ట్ కూడా ఉందని ప్రచారం జరుగుతున్నది.
క్రిస్టియన్ ఛారిటబుల్ ట్రస్ట్లు విదేశాల నుండి నిధులను సేకరిస్తూ మతమార్పిళ్లకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ కేంద్రంగా నిధుల పంపిణీ జరుగుతోందన్న అనుమానంతో కేంద్ర హోంశాఖ సిబిఐ దాడులు కూడా చేయించింది.