(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు మరోసారి షాకిచ్చింది. విలీనం డిమాండ్ను పక్కనబెట్టినప్పటికీ… కార్మికుల్ని విధుల్లోకి తీసుకునేది లేదని తేల్చి చెప్పింది. ప్రభుత్వం తరఫున హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ఆర్టీసీ ఇన్చార్జ్ ఎండీ సునీల్శర్మ… కార్మికుల డిమాండ్లను పరిష్కరించే ఆర్థిక పరిస్థితి యాజమాన్యానికి లేదని స్పష్టం చేశారు. దీంతో ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం వైఖరి మరోసారి స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా పరిణామాలు వేడెక్కాయి. సమ్మెపై ఆర్టీసీ జేఏసీ నేతలు ఎలాంటి కార్యచరణ ప్రకటిస్తారన్నది ఉత్కంఠగా మారింది.
సమ్మె కొనసాగిస్తున్న కార్మికులు ఓ మెట్టు దిగి విలీనం అంశాన్ని పక్కనబెట్టి.. మిగిలిన డిమాండ్లపై చర్చలకు పిలవాలని కోరారు. దీంతో ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తుందని అంతా భావించారు. అయితే, సీఎం కేసీఆర్ మాత్రం కార్మికులు విషయంలో వెనక్కి తగ్గడం లేదు. విలీనం డిమాండ్ను కార్మికుల పక్కనబెట్టినప్పటికీ… మిగతా డిమాండ్లను కూడా పరిష్కరించేందుకు సిద్ధంగా లేమని ఆర్టీసీ ఎండీ స్పష్టం చేశారు. కార్మికుల సమ్మె వల్ల సంస్థకు ఇప్పటివరకు 44 శాతం నష్టాలు వచ్చాయని హైకోర్టుకు నివేదించారు. ప్రతిపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని కష్టాల్లోకి నెట్టేందుకు యూనియన్ నేతలు పని కట్టుకుని సమ్మె బాట పట్టారని అఫిడవిట్లో పేర్కొన్నారు.
ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ వైఖరి మరోసారి స్పష్టం చేయడంతో… కార్మిక సంఘాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. విలీనం డిమాండ్ను పక్కనబెట్టినప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోవడంతో న్యాయస్థానంలో తమ వాదనలు వినిపిస్తామంటున్నారు జేఏసీ నేతలు. ప్రభుత్వం దిగివచ్చేవరకు ఆందోళనలు ఆపేదిలేదని ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించారు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా నలుగురు జేఏసీ నేతలు ఇందిరా పార్క్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. అయితే దీక్షలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వ తీరుకు నిరసనగా జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి శనివారం ఇంట్లోనే దీక్షకు దిగారు. పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నించినా ఆయన బయటకు రాకుండా దీక్ష చేపట్టారు.
ఇక ఎల్బీనగర్ లో ఆర్టీసీ జేఏసీ కో-కన్వీనర్ రాజిరెడ్డిని ఆదివారం మరోసారి పోలీసులు అరెస్టు చేశారు. నిన్న ఇంట్లో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న రాజిరెడ్డిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించి.. సాయంత్రం విడుదల చేశారు. అయితే, నిన్న సాయంత్రం నుంచి కుటుంబ సభ్యులతో కలిసి రాజిరెడ్డి ఇంట్లోనే దీక్షకు కూర్చున్నారు. దీంతో ఇవాళ రాజిరెడ్డితోపాటు ఆయన కుటుంబ సభ్యులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదిఇలా ఉంటే ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన ఆఫిడవిట్ పై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. దీంతో వాదనలు ఎలా ఉంటాయనేదానిపై సర్వత్రా ఉత్కంఠగా నెలకొంది.