అమరావతి, మార్చి 4: వైసిపి ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. వైసిపి నిస్పృహతో తెలంగాణలో మనపై కేసులు పెట్టే స్థితికి వచ్చిందని చంద్రబాబు అన్నారు. 20ఏళ్ల నుండి పార్టీ సమాచారం కంప్యూటరీకరించగా, దాన్ని తెలంగాణ ప్రభుత్వ సాయంతో దొంగలించే నీచానికి ఒడిగట్టారని చంద్రబాబు మండిపడ్డారు.
పార్టీ నేతలతో సోమవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ న్యాయస్థానంతో చివాట్లు తినడం వాళ్లకు ఒడిగట్టిన నీచానికి చెంపపెట్టని అన్నారు.
ఒటమి భయంతోనే రాష్ట్రంలో టిడిపి ఓట్లు తొలగించే ప్రక్రియ చేపట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుర్మార్గాలకు మోది, కెసిఆర్ సహకరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఎనిమిది లక్షల టిడిపి ఓట్లు తొలగించేందుకు కుట్రపన్నారని చంద్రబాబు విమర్శించారు.
సాంకేతికతను తాము ప్రోత్సహిస్తుంటే, సైబర్ క్రైమ్ను వాళ్లు ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. వీటన్నింటికి గట్టిగా గుణ పాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు అన్నారు.
బోగస్ ఓట్లు పేర తొలగింపునకు పాల్పడిన వారందరిపైనా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు. వీరు అధికారంలోకి వస్తే ఇంకెన్ని సంఘ విద్రోహ చర్యలకు పాల్పడతారోనని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
ఓట్ల తొలగింపుపై గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు నిచ్చారు.
ఓట్ల నమోదు, తొలగింపులో తప్పుడు పనులను సహించేది లేదని అన్నారు. తప్పుడు దరఖాస్తుదారులపై కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు. దొంగ సంతకాలు పెట్టిన వారందరినీ గుర్తించాలని అధికారులను ఆదేశించామని సైబర్ నేరగాళ్లను ఎవరినీ వదిలేది లేదని చంద్రబాబు అన్నారు.