(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
న్యూఢిల్లీ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) చట్టాన్ని చత్తీస్ఘడ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఎన్ఐఎ చట్టం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ బుధవారం సుప్రీంకోర్టులో సివిల్ వ్యాజ్యం దాఖలు చేసింది. రాష్ట్రాల్లో పోలీసు కార్యకలాపాలలో ఎన్ఐఎ జోక్యం ఉండరాదని పిటిషన్లో వాదించారు.
రాజ్యాంగంలో నిర్దేశించిన రాష్ట్ర సార్వభౌమాధికారానికి ఎన్ఐఎ చట్టం వ్యతిరేకం. దర్యాప్తు జరిపేందుకు రాష్ట్రానికి ఉన్న అధికారాన్ని ఎన్ఐఎ చట్టం హరిస్తున్నది. కేంద్రానికి విచక్షణాపూరితమైన అక్రమ అధికారాలను కట్టబెడుతున్నది అని చత్తీస్ఘడ్ పేర్కొన్నది. చత్తీస్ఘడ్ ఎన్ఐఎ చట్టాన్ని సవాలు చేసిన మొదటి రాష్ట్రం. రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్ఐఎ కొన్ని కేసులను మాత్రమే చేపడుతున్నందు వల్ల ఈ పిటిషన్ దాఖలు చేయాల్సివచ్చిందని చత్తీస్ఘడ్ అడ్వొకేట్ జనరల్ సతీష్ వర్మ పేర్కొన్నారు.
యుపిఎ హయాంలో చిదంబరం హోంమంత్రిగా ఉండగా ఎన్ఐఎ బిల్లును 2008లో పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ముంబై టెరరిస్టు దాడుల దరిమిలా ఈ చట్టాన్ని చేశారు. దీని ద్వారా అమెరికాలోని ఎఫ్బిఐ రీతిలో సిబిఐ కన్నా శక్తివంతమైన ఎన్ఐఎ ఏర్పడింది.