న్యూఢిల్లీ: నిర్భయ కేసులో నలుగురు దోషులకు మరణ శిక్షణను డెత్ వారెంట్ లో పేర్కొన్నట్లుగా జనవరి 22న ఉరిశిక్ష అమలు చేయడం సాధ్యం కాదని బుధవారం ఢిల్లీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. క్షమాభిక్ష పిటిషన్, ఉరిశిక్ష అమలు మధ్య 14 రోజుల పాటు గడువు ఉండాలని.. అందువల్ల 22న ఉరి సాధ్యం కాదని స్పష్టం చేసింది. మరణశిక్ష నిలుపుదల చేయాలని కోరుతూ దోషులు ముకేశ్ సింగ్, వినయ్ శర్మ పెట్టుకున్న క్యురేటివ్ పిటిషన్ను మంగళవారం(జనవరి 14) సుప్రీం కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీంతో క్షమభిక్ష కోరుతూ ముకేష్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు అభ్యర్థన సమర్పించాడు. దానిపై రెండు వారాల్లో రాష్ట్రపతి నిర్ణయం వెలువరించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 22న ఉరిశిక్ష అమలు జరగదని హైకోర్టుకు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. జైళ్ల నిబంధనల ప్రకారం ఉరి శిక్ష పడిన కేసులో దోషులు క్షమాభిక్ష పిటిషన్ కోసం వేచి చూడాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో ఈ శిక్షను అమలు చేయలేమని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. కేవలం దోషి పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్ధనను రాష్ట్రపతి తిరస్కరించిన తరువాతనే మరణ శిక్ష అమలుపై తుది నిర్ణయం వుంటుందని తెలిపింది. అప్పటివరకు నలుగురు దోషులలో ఎవరినీ జనవరి 22 న ఉరితీయలేమని స్పష్టం చేసింది.
మరోవైపు ముకేశ్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించాలని నిర్భయ తల్లి ఆశాదేవి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కోరారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, రాష్ట్రపతి వద్ద ముకేశ్ మెర్సీ పిటిషన్ పెండింగ్లో ఉంది. క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి తిరస్కరించిన పక్షంలో కనీసం 14 రోజుల తర్వాత దోషులను ఉరి తీయాల్సి ఉంటుంది.
ఏడేళ్ల క్రితం సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం కేసులో దోషులుగా తేలిన వినయ్ శర్మ (26), ముకేశ్ (32), అక్షయ్ కుమార్ సింగ్ (31), పవన్ గుప్తా (25) లను జనవరి 22న ఉదయం ఏడు గంటలకు ఉరితీయాలని ఆదేశిస్తూ ఢిల్లీ కోర్టు ఇటీవల డెత్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆలోగా దోషులు తమ న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవచ్చని పేర్కొంది. దీంతో దోషులు ఇద్దరు వినయ్ శర్మ, ముఖేశ్ సింగ్ జనవరి 9న తమకున్న చిట్ట చివరి అవకాశమైన క్యురేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. దీనిపై మంగళవారం(జనవరి 14) ఎన్.వి.రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి పిటిషన్లను తోసిపుచ్చింది. ఇక ఈ పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేయడంతో నిర్భయ దోషులకు ఈనెల 22న ఉదయం 7 గంటలకు తీహార్ జైల్లో ఉరిశిక్ష అమలు చేయాలని భావించారు. ఇప్పటికే జైలు అధికారులు ఉరికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు.