(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని భావిస్తున్న జగన్ సర్కార్.. వ్యూహాత్మకంగా వికేంద్రీకరణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అనవసరమైన న్యాయపరమైన చిక్కులు రాకుండా కూడా జాగ్రత్త పడుతున్నారు. దీని ప్రకారం ఏపి వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమతుల్య అభివృద్ది చట్టం 2020 పేరుతో ఈ బిల్లు తీసుకు వస్తున్నారు. ఇందులో ఎక్కడా రాజదానిని మార్చుతారన్న ప్రస్తావన ఉండదు. విశాఖపట్నానికి సచివాలయం తరలింపు తదితర అంశాలేవీ ఇందులో ఉండవు. అలాగే ఆయా శాఖలను ఆయా ప్రాంతాలలో నెలకొల్పుకునే అదికారాన్ని కూడా బిల్లులో పొందుపరుస్తున్నారు. ప్రభుత్వం తలపెట్టిన నాలుగు ప్రాంతీయ బోర్డుల అంశం కూడా ఈ బిల్లులో పెట్టవచ్చని చెబతున్నారు. ఈ నెల పద్దెనిమిది నాటికి హై పవర్ కమిటీ నివేదిక ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఆ తర్వాత 20వ తేదీ ఉదయం మంత్రివర్గ సమావేశంలో దీనిని ఆమోదించిన తర్వాత అసెంబ్లీలో పెడతారు. తదుపరి రోజు శాసనమండలిలో పెడతారు. ఒకవేళ కౌన్సిల్ లో టిడిపి మెజార్టీ ఉన్నందున అక్కడ తిరస్కరణకు గురైతే, తరిగి అసెంబ్లీలో పెట్టి ఆమోదింప చేయవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
రాజధాని అంశమై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఎన్ రావు, బీసీజీ కమిటీలు ఇచ్చిన నివేదికల్లో మూడు రాజధానుల ప్రతిపాదనలను చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలు సూచించిన అంశాలు, సిఫారసులపై అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికను అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు. జీఎన్ రావు, బీసీజీ కమిటీలు ఇచ్చిన నివేదికలను మంత్రివర్గం ఆమోదిస్తే మాత్రం అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో శాశ్వత హైకోర్టు ఏర్పాటుకు ప్రకటన చేసే అవకాశం ఉంది. అదే సమయంలో అమరావతి రైతులకు భరోసాను ఇచ్చేలా జగన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని తెలుస్తోంది.
ఏపీలో పాలన వికేంద్రీకరణ, రాజధాని రైతుల ప్రయోజనాలతో పాటు పలు కీలక అంశాలపై ఇప్పటికే హైపవర్ కమిటీ చర్చించింది. రాజధాని ప్రాంత రైతులు, జిల్లాలు, ప్రాంతాల వారీ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనపై కమిటీ చర్చించింది. రాష్ట్రంలోని 13 జిల్లాలకు సమాంతరంగా అభివృద్ధి జరగాలని కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి ఒక్కరి అభిప్రాయాలను కమిటీ పరిశీలిస్తోందని, తప్పకుండా రైతుల ప్రయోజనాలను కాపాడతామని కమిటీలోని మంత్రులు ఇప్పటికే స్పష్టం చేశారు.
మరోవైపు రాజధానిని అమరావతిని నుంచి తరలించొద్దని ఆప్రాంత రైతులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధాని రైతులకు అండగా టీడీపీ అధినేత చంద్రబాబు పోరుబాటను మరింత ఉధృతం చేశారు. విపక్షాలను కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా అమరావతి రైతులకు అండగా మద్దతు కూడగడుతున్నారు. మరోపక్క జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని ఇప్పటికే ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.