మతం అంటే దేవుడి రూపమా?? ధ్యానించే విధమా?? స్మరించే హృదయమా?? నిర్వచనాలెన్ని ఉన్నా అది ఒక భావుకతతో కూడిన చలనం. ఒక భావోద్వేగం. ఒక్క ముక్కలో చెప్పాలంటే మతమంటే మనిషి తత్వం. భిన్న మతాలున్నాయని గర్విస్తున్న చోటే మాత విద్వేషాలు పెరుగుతున్నాయని నిగర్వనా ఉంటుంది. అది పెరిగి, పెరిగి ఒక మాయదారి, మహమ్మారి రోగానికి, వైరస్ సంక్రమణకు మతం జబ్బు సంక్రమించింది. దేశాన్ని పీడిస్తున్న కరోనాకు మతాన్ని ముడిపెట్టి వారి భావోద్వేగాలతో ఆటలాడుతున్నారు కొందరు.
కరోనా పేరిట కాఠిన్యత…!
అదో మత కేంద్రం. వేలాది మంది ప్రార్థనలకు వెళ్లారు. అక్కడ ఎవరికో మహమ్మారి సోకింది.., తద్వారా వందలాది మందికి మాయదారి రక్కసి సోకింది. ఇదేం వారు తెలిసి చేసింది కాదుగా, తెలిస్తే మాయదారి రోగాన్ని అంటించుకుని రారుగా. చూసి చూసి ప్రాణం మీదకు తెచ్చుకోరుగా, కుటుంబ సభ్యులకు అంటించుకోరుగా, ఆసుపత్రుల చుట్టూ తిరగరుగా…! ఈ చిన్న లాజిక్, మర్చిపోయి మెదడుకి పైత్యాన్ని తగిలించి కొందరు కరోనాని మతానికి ముడిపెడుతున్నారు. వికృత పోస్టింగులతో మతాన్ని వెలివేసేలా ప్రవర్తిస్తున్నారు. అదే ఏ పుణ్యక్షేత్రం లోనో, చర్చిలోనే ఒకరి ద్వారా అందరికి సోకితే అదే పరిస్థితి వస్తుందా? మతం మాటున మనిషి తత్వం మర్చిపోయి ఒక్కరి వలన జరిగిన దానికి పూర్తిగా మతానికి దురుద్దేశం ఆపాదించడం మంచిది కాదుగా…! ఉంటె ఉండొచ్చు, కొందరు ఎక్కడో ఓ చోట ఉంచొద్దు. కానీ ఇది సాకుగా చూపి కొన్ని గ్రామాల్లో , చాల చోట్ల ఆ మతస్తులను వెలివేసినట్టు, పూర్తిగా పక్కన పెట్టారు.
చీరాలలో ఆ హద్దులను చెరిపారు, చెరపాల్సిన క్షణం…!
అవును.., ఇది మతాలకు మధ్య హద్దులను చెరపాల్సిన క్షణం. అధికారులు, నాయకులూ చొరవ తీసుకోవాల్సిన తరుణం. అది గుర్తించారు కనుకనే సీఎం జగన్ నిన్న వీడియో సందేశంలో కరోనా మతం వలన వచ్చినది కాదంటూ చెప్పారు. మతానికి ముడి పెట్టవద్దని కోరారు. అది గ్రహించిన చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పది అడుగులు ముందుకేసి ఆదర్శంగా నిలిచారు.
- చీరాల లోని నవాబు పేటలో కొద్దీ రోజుల కిందట ఒకరికి కరోనా వచ్చింది. ఆ ప్రాంతం వారు ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చారని తెలిసి అటు వైపుగా ఎవరూ వెళ్లడం లేదు. కనీసం పాలు, కూరగాయలు, రేషన్ వంటి నిత్యావసరాలు కూడా వారికి అందడం లేదు. రెడ్ జోన్ గా భావించి ఒక రకంగా ఆ కుటుంబాలను, ఆ ప్రాంతాన్ని వెలివేశారు. ఇది తెలుసుకున్న ఆమంచి వెంటనే ఆ నవాబ్ పేటకు వెళ్లారు. వీధి వీధినా తిరిగారు. నేరుగా వారితో మాట్లాడి తక్షణమే వారికి కావాల్సిన నిత్యావసరాలు, రేషన్ అందించే ఏర్పాట్లు చేసారు. స్వీట్ సమోసాలు తయారు చేసే మున్నీర్ మరణానికి కిడ్నీ ఫెయిల్యూరే కారణమంటూ వైద్యులు ఇచ్చిన నివేదికలను ప్రదర్శించారు. ఆ ముస్లిం కుటుంబాలకు ధైర్యం కలిగిస్తూనే ఇతరులకు మార్గదర్శకమయ్యారు. కరోనా వైరస్ ముస్లిం ల వలన వచ్చింది కాదు, ఒక అసత్య ప్రచారాన్ని సృష్టించి వారిని దూరదృష్టితో చూడడం సబబు కాదు, అంటూ సమస్యని పరిష్కరించారు.
- ఇది చీరాలలో మాత్రమే కాదు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి. ఇదే కీలక తరుణం. నాయకులూ, అధికారులు కలిసి ఆ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేయాలి.