ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు విభజన చట్ట ప్రకారం రావాల్సిన నిధులు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక వినతపత్రం సమర్పించారు. వివిధ అంశాలకు సంబంధించి మొత్తం 74,169 కోట్ల రూపాయలు ఇవ్వాలని అందులో ప్రధాని నరేంద్ర మోదీని కోరారు.
రెండవసారి ప్రధాని పదవి చేపట్టిన తర్వాత ఆదివారం సాయంత్రం శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన ప్రధానికి ముఖ్యమంత్రి స్వాగతం పలికారు. ప్రధానికి ఇచ్చిన వినతిపత్రంలోని అంశాలు. గత అయిదేళ్లలో రెవిన్యూ లోటు కింద మొత్తం 22,948 కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా ఇప్పటి వరకూ 3979 కోట్లు మాత్రమే ఇచ్చారనీ, ఇంకా 18,969 కోట్లు ఎపికి కేంద్రం నుంచి రావాలనీ లేఖలో పేర్కొన్నారు.
విభజన చట్టంలోని పన్నులకు సంబంధించిన సెక్షన్ 50, సెక్షన్ 51లను సవరిస్తే ఏపీకి అదనంగా 3,820 కోట్ల రూపాయలు వస్తాయని, ఈ సెక్షన్లను సవరించి ఏపీకి న్యాయం చేయాలని జగన్ కోరారు.
ఎపీలోని ఏడు వెనుకబడిన జిల్లాలకు ఏడాదికి 350 కోట్ల రూపాయల చొప్పున ఇవ్వాల్సిఉంది. గత ఐదేళ్లలో మూడేళ్లు ఈ నిధులు సక్రమంగానే ఇచ్చారు. నాలుగో ఏడాది 350 కోట్ల రూపాయలు ఏపీ ఖాతాలో వేసి వెనక్కి తీసుకున్నారు. అయిదవ ఏడాది అసలు ఇవ్వలేదు. నాలుగో ఏడాది వెనక్కి తీసుకున్న నిధులను విడుదల చేయాలని నీతిఆయోగ్ కూడా సిఫారసు చేసినప్పటికీ కేంద్రం ఇంకా ఆ నిధులు విడుదల చేయలేదు. ఈ నిధులు వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ఏపీలోని ఏడు వెనుకబడిన జిల్లాలకు విభజన చట్టంలో హామీ ఇచ్చిన విధంగా బుందేల్ఖండ్ ప్యాకేజీ ఇవ్వాలని, ఇందుకుగాను 23,300 కోట్ల రూపాయలు విడుదల చేయాలని కూడా కోరారు.