హైదరాబాద్: తెలంగాణలోని మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియలో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. రాజ్యసభ సభ్యుల ఎక్స్ అఫీషియో ఓట్లు వివాదాస్పదంగా మారాయి. తెలంగాణ కోటాలో కేవీపీ రామచంద్రరావు ఓటుపై టీఆర్ఎస్ అభ్యంతరం తెలపగా.. ఏపీ కోటాలో ఉన్న కేకేకి తుక్కుగూడలో ఓటు హక్కు ఇవ్వడంపై బీజేపీ అభ్యంతరం తెలిపింది. అయితే తెలంగాణ కోటాలో కేవీపీ రాజ్యసభకు ఎన్నికయ్యారు అని కాంగ్రెస్ ఆందోళన చేయటంతో ఆయన ఓటు వేసేందుకు ఎన్నికల కమిషన్ అనుమతిచ్చింది. నేరేడుచర్ల మున్సిపాలిటీలో కేవీపీ ఓటు వేయటంపై స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఎన్నిక వాయిదా పడింది. ఏపీ కోటాలో ఉన్న కేకేకి తుక్కుగూడలో ఓటు హక్కు ఇవ్వడంపై బీజేపీ అభ్యంతరం తెలిపింది. దీంతో తుక్కుగుడలో ఉద్రిక్తత నెలకొంది. తుక్కుగూడలో బీజేపీ తొమ్మిది స్థానాలకు కైవసం చేసుకోగా.. టీఆర్ఎస్ ఐదు స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది. స్వతంత్ర అభ్యర్థి టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ బలం ఆరుకు చేరుకుంది. టీఆర్ఎస్ తరపున ఐదుగురు సభ్యులు ఎక్స్ అఫిషియో ఓటు నమోదు చేసుకున్నారు.
మరోవైపు చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్మన్ ఎంపిక తీవ్ర గందరగోళానికి దారి తీసింది. చైర్మన్ ఎంపిక విషయంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సీపీఎం కార్యకర్తలను కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మున్సిపాలిటీ కేంద్రం వద్ద కొట్టుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది. ఇక్కడ సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేశాయి. అయితే, తాజాగా టీఆర్ఎస్, సీపీఎం మధ్య పొత్తు కుదిరినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అక్కడకు చేరుకున్నారు. లోపలకు వెళుతున్న సీపీఎం కార్యకర్తలను అడ్డుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో రాజగోపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి మధ్య వాగ్వాదం కాస్తా ఘర్షణకు దారి తీసింది. ఇరు పార్టీల కౌన్సిలర్లు చొక్కాలు పట్టుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో రాజగోపాల్రెడ్డి ప్రమాణ పత్రాలను చించేశారు. ఇది అక్రమమైన పొత్తు అంటూ ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులు ఆయనను బయటకు తీసుకొచ్చారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులపై రాళ్లు రువ్వారు.