కనులకు నీరుంటే అది ఇంకుతుంది. మనసుంటే అది జంకుతుంది. కరోనా కల్లోలం పరిచయం చేస్తున్న సంఘటనలకు గుండెలు బరువెక్కుతున్నాయి…!
అసలే పేద దేశం. 27 శాతం బీదలే అని నివేదికలున్నాయి. రెక్కాడితే కానీ, డొక్కాడదు. దేశంలో దాదాపు పది కోట్ల కుటుంబాలు, అంటే దాదాపు 35 కోట్ల మంది పరిస్థితి ఇంతే. మరి లాక్ డౌన్ పడింది. సేద్యం లేదు. పరిశ్రమలు లేవు. దుకారణాలు లేవు. పనులు లేవు. ఎక్కడివారక్కడే ఆగిపోయారు. జనజీవనం కొద్దీ రోజులు స్తంభించింది. ఈ జీవనం మధ్య తరగతిపై కొంత ప్రభావం ఉన్నా భవిష్యత్తులో చూపిస్తుంది. కానీ పేద వర్గాలకు మాత్రం లాక్ డౌన్ పడిన రెండు రోజుల నుండీ ఫలితాలు కనిపిస్తున్నాయి. అవి కూడా గుండె కరిగిపోయేలా, కన్నీటితో నింపేలా ఉన్నాయి. ఆకలి చవులు, వైద్యం అందక వచ్చే చవులు ఆగకమునుపే ఈ లాక్ డౌన్ వచ్చి వాటిని విస్తృతం చేసింది.
కుమారుడి శవాన్ని మోసుకెళ్లిన తండ్రి…!
- అనంతపురం జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన మనోహర్, రమణమ్మలకు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు దేవాకు పది రోజులు కిందట సుస్తీ చేసింది. కదిరిలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ రెండు రోజుల వైద్యం తర్వాత రోగం ముదరడంతో అనంతపురం తరలించాలని సూచించారు. అక్కడా నయమవ్వక బెంగుళూరు వెళ్లాలని సూచించారు. కూలి కుటుంబం, రోజు పనులకు వెళ్లి, పనులు లేకపోతే చెత్త ఏరుకుని గుడిసెలో బతుకుతున్న కుటుంబం. పనుల్లేవు, చెత్త ఏరుకునేందుకు బయట తిరగనీయడం లేదు. ఇంకేం వైద్యం చేయించగలరు… బెంగుళూరుకి తీసుకెళ్లడంలో ఆలస్యం అవ్వడంతో కుమారుడు మృతి చెందాడు. పేద బతుకుకి ఇటువంటి మరణాలు సహజమే. కానీ కరోనా కాటు అక్కడితో ఆగలేదు. పాపం ఆ అభాగ్యుడు మృతదేహం మోసేందుకు ఎవరూ బయటకు రాలేదు. ఆ తండ్రి కుమారుడి మృతదేహాన్ని మోసుకుని నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్లి ఖననం చేశారు. కరోనా మిగిల్చిన కన్నీటి గాధని వారి నుదుటిపై ముద్రించుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
బువ్వ లేక మొక్కలనే తింటూ…!
ఇది మరో పేదరిక కథ. పేద బతుకు నుదుటిపై కరోనా లిఖించిన మరో కన్నీటి గాధ. సాక్షాత్తు ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో పేద వర్గాలకు కొదవేం లేదు. అక్కడ ఆలయం వద్ద, సమీప పల్లెల్లో బిచ్చమెత్తుకుంటూ బతుకునీడుస్తున్న కుటుంబాలు అనేకం ఉన్నాయి. ఆ కుటుంబాలకు ఇప్పుడు పట్టెడన్నం లేదు. భక్తుల రాకపోకలు లేక, పది రోజులుగా ఆదాయం లేక ఆ కుటుంబాల్లో చాల మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఆ క్రమంలోనే ఓ ఇంటి చిన్నారులు ఆకలితో ఆగలేక ఇలా పిచ్చి మొక్కలను తింటున్నారు. వీధి చివరనున్న మొక్కల్లోకి వెళ్లి తినడానికి ప్రయత్నించారు. ఇది చుసిన పల్లెవాసులు చలించిపోయి అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అధికారులు తేరుకుని పంచాయతీ నిధులతో పది కిలోల బియ్యం, నూనె, పప్పు అందించారు. ప్రధాని నియాజకవర్గం కాబట్టి అధికారులు అంత వేగంగా స్పందించారు. లేకుంటే పరిస్థితి మరోలా ఉండేది.
ఇలా బయటపడిన చిత్రాలు, సంఘటనలు అనేకం ఉన్నాయి. కానీ బయటకు రానివి, అక్కడికక్కడే సమసిపోతున్నవి ఇంకా అనేకం ఉంటాయి. అదే కరోనా ఫలితమో, దేవుడి శాపమో, మహమ్మారి సోకకపోయినా బతుకులు తారుమారవుతున్నాయి.