అమరావతి: బంగాళాఖాతంలో కోస్తా తమిళనాడు పరిసరాల్లో సముద్రమట్టానికి 5.8 నుండి 7.6 కిలో మీటర్ల ఎత్తున కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ధ్రోణి సెప్టెంబర్ రెండవ తేదీ నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని వల్ల తెలంగాణ, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుండి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఒడిషా పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తున కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, దానికి అనుబంధంగా వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో శనివారం చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. ప్రస్తుతం ఇది బలహీనపడగా, తమిళనాడు కోస్తాలో ఏర్పడిన ధ్రోణి బలపడుతోందని తెలియజేసింది. ఈ కారణంగా తెలంగాణ, కోస్తాంధ్ర, దీన్ని ఆనుకుని ఉన్న ఒడిషా, చత్తీస్ఘడ్ ప్రాంతాల్లో నేటి నుండి మూడు రోజుల పాటు ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.