(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టి వంద రోజులు గడిచాయి. ఈ వంద రోజుల్లోనే రాష్ట్రం చాలా పరిణామాలు చవి చూసింది. ప్రమాణ స్వీకారం అనంతరం జగన్ ప్రసంగిస్తూ, ఆరు నెలలు సమయం ఇవ్వండి మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటాను అన్నారు. ఆ ఆరు నెలల వ్యవధిలో సగం పైగా రోజులు గడిచిపోయాయి. మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవడం ఏమోగానీ జగన్ చాలా వివాదాలను కొని తెచ్చుకున్నారు.
ముఖ్యమంత్రికి చాలా పట్టుదల గల వ్యక్తిగా పేరుంది. ఎన్ని అవరోధాలు ఎదురయినా మొండిగా ముందుకు వెళతారు. గత అయిదేళ్లు ప్రభుత్వం నడిపించిన టిడిపి ఎన్నికల్లో ఘోర పరాజయం మూట కట్టుకున్నా గానీ ఆ పార్టీ నాయకత్వంపై జగన్ కోపం తగ్గినట్లు లేదు. ముఖ్యమంత్రి నిర్ణయాలు కొన్నిటిని ఆ కోపమే ప్రభావితం చేస్తున్నది. ఫలితంగా, వైసిపి ప్రభుత్వానికి కొన్నాళ్లు టైమిచ్చి చూద్దామనుకున్న టిడిపి మూడు నెలలు తిరగకుండానే ప్రభుత్వంపై పోరాటానికి దిగింది.
దీనివల్ల ఇప్పటికిప్పుడు వైసిపి ప్రభుత్వానికి వచ్చిన నష్టం లేదు. ఇవాళ కాకపోతే రేపైనా అధికారపక్షమైన వైసిపి, ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి సంఘర్షించుకోవాలసిందే. అయితే జగన్ తన నిర్ణయాల ద్వారా మరో రాజకీయ శక్తికి రాష్ట్రంలో బలపడే అవకాశం ఇస్తున్నారు. వైసిపి ప్రభుత్వం తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాల వల్ల టిడిపితో పాటు భారతీయ జనతా పార్టీ కూడా ప్రజాక్షేత్రంలోకి రాగలుగుతున్నది.
మొన్నటి ఎన్నికలలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సహా పోటీ చేసిన ఏ ఒక్క బిజెపి నేతకూ ధరావత్తు దక్కలేదు. లోక్సభ స్థానాలలో మొత్తం చెల్లుబాటయిన వోట్లలో బిజెపికి 0.96 శాతం వోట్లే వచ్చాయి. అసెంబ్లీ స్థానాలలో ఆ పార్టీ 0.84 శాతం వోట్లు సాధించగలిగింది. అలాంటి పార్టీ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ – అమితా షా ప్రభుత్వం దన్నుతో ఇక్కడి వైసిపి ప్రభుత్వంపై ఒంటి కాలిమీద లేస్తున్నది.
వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో గట్టి రాజకీయ శక్తిగా ఎదగాలన్నది బిజెపి లక్ష్యం. అందుకు ఒకపక్క టిడిపి బలహీనం కావాలి. రెండవ పక్క వైసిపి పాలన సవ్యంగా లేదన్న విమర్శతో ప్రజలకు దగ్గర కావాలి. టిడిపిని బలహీనపరచడంలో బిజెపి ఏమాత్రం సఫలీకృతం కాగలదో కానీ వైసిపి ప్రభుత్వంపై విమర్శతో ప్రజలకు దగ్గరయ్యే అవకాశాన్ని ఆ పార్టీకి ముఖ్యమంత్రి జగన్ చేజేతులా ఇస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టు రీ టెండరింగ్, రాజధానిగా అమరావతి కొనసాగింపులో అనిచ్ఛితి, విధానం మార్చడం పేరుతో వచ్చిపడిన ఇసుక కొరత బిజెపి చేతిలో అస్త్రాలుగా మారాయి. సంస్థాగతంగా బిజెపికి బలం లేకపోయినా సమస్యలను ప్రజలు బిజెపి నాయకుల దగ్గరకు తీసుకువెళుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అన్న అంశం ఇంతకుముందు ఉపయోగపడక పోయినా వారికి ఇప్పుడు ఉపయోగపడుతున్నది.
దేశంలో ఏ పార్టీనీ బిజెపితో పోల్చలేమని ఇప్పటికే అనుభవం ద్వారా అర్ధమయింది. బలపడేందుకు ఆ పార్టీ నాయకత్వం ఎలాంటి మార్గాన్నయినా అనుసరించగలదు. కేంద్రంలో అధికారం వారిదే కాబట్టి నిధుల విషయంలో వైసిపి ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో ఇబ్బంది పెట్టడం బిజెపికి చాలా తేలిక. ఆ విషయంలో వైసిపి నాయకత్వం చేతిలో ఎటూ ఏమీ లేదు. కనీసం రాష్ట్రంలో బిజెపికి ఎక్కువ పని లేకుండా చేయడం వైసిపి చేతిలోనే ఉంది. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల్లో తమకు పెద్ద శత్రువు ఎవరో జగన్ తేల్చుకోవడంపై అంతా ఆధారపడి ఉంటుంది.