- ఎన్నికల కాలంలో జోరుగా హ్యాకింగ్
- దేశంలో పెరుగుతున్న సైబర్ యుద్ధాలు
- ఇప్పటికే పలు పార్టీల వెబ్ సైట్ల హ్యాకింగ్
- సైబర్ భద్రతపై దృష్టి పెట్టని నాయకులు
- అజాగ్రత్తగా ఉంటే పొంచి ఉండే హ్యాకర్లు..
(కంచన్ శ్రీవాస్తవ)
ఒకప్పుడు ఎన్నికలంటే వాల్ పోస్టర్లు, మైకుల హడావుడి ఎక్కువగా కనిపించేది. ఇప్పుడంతా ఏసీ గదుల్లో 40-50 మంది అత్యాధునిక కంప్యూటర్ల ముందు కూర్చుని నిశ్శబ్దంగా పని చేసుకోవడమే. ఎవరికి వారు తమకు వీలైనంతగా సైబర్ స్పేస్ లోనే కొట్టుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయం కావడంతో.. సైబర్ యుద్ధాలు పుంజుకున్నాయి. ఈనెల 5వ తేదీన అధికార పార్టీ బీజేపీ వెబ్ సైట్ హ్యాక్ అయింది. ఇప్పటికీ అది మాత్రం ‘నిర్వహణలో ఉంది’ అనే చూపిస్తోంది. కొద్ది నిమిషాల పాటు అది హ్యాకింగుకు గురైందని స్వయంగా కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. అది ఎప్పుడు తిరిగి వస్తుందో మాత్రం చెప్పలేదు.
డేటా మొత్తం స్వాహా
సాంకేతిక కారణాల వల్ల వెబ్ సైట్ డౌన్ అయిందని బీజేపీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాలవీయ తెలిపారు. సాంకేతికంగా ఇంత బలంగా ఉన్న పార్టీ సైట్ హ్యాకింగ్ కావడం ఆశ్చర్యకరమని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు, టెక్నిసాంక్ట్ సీఈవో నందకిశోర్ హరికుమార్ అన్నారు. అందులో ఉన్న స్టాటిక్, డైనమిక్ కంటెంట్ అంతా తుడిచిపెట్టుకుపోయిందని చెప్పారు. పార్టీ సభ్యుల ఈమెయిల్ వివరాలు, దాతల వివరాలు, అభ్యర్థుల సర్వేలు.. ఇలాంటివన్నీ ఆ సైటులోనే ఉంటాయి. వాటికి సంబంధించిన బ్యాకప్ కూడా ఉందోలేదో తెలియదు. ఫిబ్రవరి 21న ఛత్తీస్ గఢ్ బీజేపీ సైట్ కూడా హ్యాకయింది. అదీ ఇంకా కోలుకోలేదు. ఇదంతా పాకిస్థానీ హ్యాకర్ల పనేనని బీజేపీ అంటోంది.
అన్నిపార్టీలదీ అదే పరిస్థితి
బీజేపీ ఒక్కటే కాదు.. గుజరాత్ కాంగ్రెస్ పార్టీ వెబ్ సైట్ కూడా ఫిబ్రవరి 21న సైబర్ దాడికి గురైంది. అయితే, కొన్ని గంటల్లోనే దాన్ని పునరుద్ధరించారు. 2012 నుంచి 2018 మధ్య టీడీపీ, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, సమాజ్ వాదీ లాంటి పలు పార్టీల సైట్లు హ్యాకయ్యాయి. వాటి నుంచి ఎంత డేటా పోయిందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఎన్నికలు సమీపిస్తుండటంతో విదేశాలతో పాటు మన దేశంలోని హ్యాకర్లు కూడా చేతివాటం చూపిస్తున్నారు. ఈ విషయాన్ని సైబర్ సెక్యూరిటీ సంస్థ బల్వార్క్ సైబర్ఎక్స్ వ్యవస్థాపకుడు సంజయ్ గోయల్ చెప్పారు. పార్టీలు, నాయకులు, చివరకు ప్రభుత్వాధికారులకు కూడా సైబర్ భద్రత గురించి తెలియదన్నారు. భారత ఎన్నికల వ్యవస్థ ఒక టైంబాంబు మీద కూర్చుందని చెప్పారు. అలాగని మన దేశమే కాదు.. ఆస్ట్రియాలో కూడా ఇటీవల ఇలాగే అయ్యింది. అమెరికాలో 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలోనూ ఇదే జరిగింది.
అజాగ్రత్తగా ఉంటే అంతే..
వివిధ పోర్టళ్లు, ఈమెయిల్ అకౌంట్లను హ్యాక్ చేయడం ఏమంత కష్టం కాదు. జనవరిలో ఒక ఆస్ట్రేలియన్ పరిశోధకుడు 200 కోట్ల ఈమెయిళ్లు, పాస్ వర్డ్ లను సేకరించారు. ఈ ముప్పు ప్రపంచవ్యాప్తంగా ఉంది. ముఖ్యంగా తెలియని మెయిల్ ఐడీల నుంచి వచ్చే లింకులు లేదా ఎటాచ్ మెంట్లను క్లిక్ చేశారో.. ఇక అంతే. అలాగే మొబైల్ ఫోన్లకు వచ్చే మెయిల్ ముట్టుకోవాలన్నా జాగ్రత్తగా ఉండాల్సిందే. హ్యాకర్లను గుర్తుపట్టడం చాలా కష్టం. ఒక్కోసారి కేవలం సమాచారాన్ని మాత్రమే పాడుచేసేవాళ్లుంటారు. కొందరు ఏకంగా బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులూ కొట్టేస్తారు. 2015లో హ్యాకర్లు 30 దేశాల్లో బ్యాంకుల నుంచి 10000 లక్షల కోట్ల డాలర్ల మొత్తం కొట్టేశారు. వైరస్ లు, మాల్ వేర్, అత్యాధునిక స్పైవేర్ సాయంతో వాళ్లు సులభంగా మన సిస్టంలోకి చొచ్చుకొస్తారు.
పార్టీలకు టెక్నాలజీ ఎందుకు?
దేశంలో 2వేల పార్టీలున్నాయి. 80 కోట్ల మందికి పైగా ఓటర్లున్నారు. వీరందరినీ భౌతికంగా చేరుకోవడం అసాధ్యం. అందుకే పార్టీలు టెక్నాలజీ మీద ఆధారపడుతున్నాయి. కేవలం ఓటరు కార్డు వివరాలే కాదు.. వాళ్ల ఆసక్తి, రాజకీయ అభిప్రాయం లాంటివాటిని సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటున్నారు. ఇందుకు బిగ్ డేటా ఎనలిటిక్స్ ఉపయోగపడుతుంది. కానీ ఇంత చేసే పార్టీలు సైబర్ భద్రత గురించి ఆలోచించడం లేదు. పది సిస్టంలుండే చిన్న ఆఫీసుకు ఫైర్ వాల్ కావాలంటే లక్ష రూపాయలు అవుతుంది. సిస్టంలు పెరిగేకొద్దీ ఈ ఖర్చు కూడా పెరుగుతుంది.
ఎక్కడెక్కడి నుంచి..
2018 జనవరి నుంచి జూన్ వరకు భారతదేశంలో 6.9 లక్షల సైబర్ దాడులు జరిగాయి. వాటిలో 2/3 వంతు చైనా, అమెరికా, రష్యాల నుంచే జరిగాయి. దేశంలో సైబర్ స్నూపింగ్ ఎక్కువవుతోందని కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా గత సంవత్సరం హెచ్చరించారు. కార్పొరేట్లు, రాష్ట్ర ప్రభుత్వాల సైట్లను స్నూపింగ్ చేసి కీలక సమాచారాన్ని దొంగిలిస్తున్నారన్నారు.
సెకనుకో బగ్
దేశంలో ప్రతి నిమిషం కొత్త వైరస్, యాడ్ వేర్ లాంటి బగ్ లు పుట్టుకొస్తున్నాయి. ఈ విషయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వంతో సంబంధమున్న సైబర్ నిపుణుడు ఒకరు రెండేళ్ల క్రితం చెప్పారు. ఇప్పుడు సెకనుకు ఓ కొత్త బగ్ వస్తోంది. రక్షణ, హోం, కార్మిక, న్యాయశాఖ లాంటి కేంద్ర ప్రభుత్వశాఖల వెబ్ సైట్లు కూడా గత జూలైలో ఆరుగంటల పాటు సైబర్ దాడి వల్ల పడుకున్నాయి. ఇప్పుడు ఆర్థిక సేవలు, టెలికం కంపెనీలకు ఎక్కువ ముప్పు ఉంటోంది. ఎన్నికల కమిషన్ ఇంతవరకు డేటా హ్యాక్ అయినట్లు ఫిర్యాదు ఏమీ చేయలేదు. కానీ, అలా జరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. తమ డేటాను ఆఫ్ లైన్ లో కూడా స్టోర్ చేసి ఉంచామని, అందువల్ల దానికొచ్చిన ముప్పేమీ లేదని ఈసీ అధికారి ఒకరు చెప్పారు.
(న్యూస్ లాండ్రీ సౌజన్యంతో)