బెంగళూరు: రాజ్యాంగం ప్రకారం తన నిర్ణయం ఉంటుందని కర్నాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. నాకు నేను సంతృప్తి చెందినపుడే రాజీనామాలు ఆమోదిస్తాను అని ఆయన పేర్కొన్నారు. తన నిర్ణయం చారిత్రాత్మకం కావాలని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం గురువారం సాయంత్రం 11 మంది కాంగ్రెస్ రెబల్ శాసనసభ్యులు బెంగళూరు వచ్చి స్పీకర్ను అసెంబ్లీలో కలిశారు. గంట సేపు సమావేశం తర్వాత స్పీకర్ మీడియాతో మాట్లాడారు.
స్పీకర్ ఛాంబర్లో 11 మంది శాసనసభ్యులు తాజాగా అక్కడికక్కడే మళ్లీ రాజీనామాలు రాసి ఆయనకు సమర్పించారు. వారు బయటకు వెళ్లిన తర్వాత స్పీకర్ మీడియాతో మాట్లాడారు.
తాను కావాలనే జాప్యం చేస్తున్నానని ఆరోపించడం సరి కాదని స్పీకర్ అన్నారు. 11 మంది రాజీనామాలలో ఎనిమిది రాజీనామాలు ఫార్మాట్లో లేవని ఆయన చెప్పారు. తనపై ఆరోపణలు చేసి సుప్రీంకోర్టుకు వెళ్లారని అన్నారు. స్పీకర్ను కలిసేందుకు అనుమతిస్తున్నాం అని పేర్కొంటున్న కోర్టు ఆదేశం చదివి వినిపిస్తూ, నా సభలో సభ్యులు నన్ను కలవడానికి సుప్రీంకోర్టు ఆదేశాలు కావాలా అని స్పీకర్ ప్రశ్నించారు.
రాజ్యాంగం ప్రకారం ఫిరాయింపులు కుదరవని కూడా స్పీకర్ ఒక సందర్భంలో అన్నారు. తన నిర్ణయం చరిత్రాత్మకం కావాలని ఆయన అన్నారు.
అంతకుముందు (18:58 గంటలు): సుప్రీంకోర్టు ఆదేశానుసారం తిరుగుబాటు కాంగ్రెస్ శాసనసభ్యులు బెంగళూరు చేరుకుని సాయంత్రం
ఆరు గంటలకు శాసనసభ స్పీకర్ ఛాంబర్లోకి ప్రవేశించారు. పది మంది ఎమ్మెల్యేలు భారీ బందోబస్తు నడుమ అసెంబ్లీకి వచ్చారు. వారి
రాజీనామాలు స్పీకర్ అమోదించిన పక్షంలో కుమారస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడుతుంది.
తమ రాజీనామాలపై స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారని పేర్కొంటూ రెబల్ శాసనసభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గురువారం ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం సాయంత్రంలోగా వెళ్లి స్పీకర్ను కలవాల్సిందిగా వారిని ఆదేశించింది. వారి రాజీనామాలపై తన నిర్ణయాన్ని స్పీకర్ రమేష్ కుమార్ ఈ రోజే సుప్రీంకోర్టుకు తెలియజేయాల్సిఉంది.
శాసనసభ్యుల రాజీనామాలపై స్పీకర్ గురువారం తన వైఖరి తెలియజెప్పాలని సుప్రీంకోర్టు పేర్కొన్న మీదట స్పీకర్ కూడా అత్యున్నత న్యాయస్థానంలో తమ వాదన దాఖలు చేశారు. స్వచ్ఛందంగా ఎలాంటి వత్తిడికీ లోను కాకుండా వారు రాజీనామాలు ఇచ్చారని నిర్ధారించుకోవడం తన రాజ్యాంగ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఆ పని హడావుడిగా చేసేది కాదనీ ఆయన పేర్కొన్నారు. శాసనసభ్యులు నేరుగా తన దగ్గరకు ఎప్పుడైనా రావచ్చనీ ఆ పని చేయకుండా కోర్టును ఆశ్రయించడంలోనే మతలబు వేరే ఉన్నట్లు అర్ధం అవుతోందనీ స్పీకర్ సుప్రీంకోర్టుకు తెలిపారు.