( ఫోోటోలు ఎఎన్ఐ సౌజన్యంతో….)
న్యూఢిల్లీ: ఒక బాలుడి లివర్ మార్పిడి కోసం ఆసుపత్రి యాజమాన్యమే ఏకంగా 11లక్షల రూపాయలు సమకూర్చిన అరుదైన ఘటనపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఢిల్లీకి చెందిన ఆలీ హమ్జా అనే ఏడేళ్ల బాలుడికి కాలేయం సమస్య వచ్చింది. ఆ బాలుడి లివర్ చెడిపోయి మాటిమాటికీ సృహ కోల్పోతున్నాడు. ఈ బాలుడిని పరీక్షించిన ఢిల్లీలోని మాక్స్ ఆసుపత్రి వైద్యులు లివర్ పూర్తిగా చెడిపోయిందనీ, లివర్ ట్రాన్స్ప్లాన్టేషన్ చేయాల్సి ఉంటుందనీ, దీనికి సుమారు 15లక్షల వరకూ ఖర్చు అవుతుందనీ తెలిపారు. అయితే ఆలీ తల్లిదండ్రులు తాము పేదలమనీ, అంత మొత్తం తాము భరించలేమనీ వివరించారు.
ఈ నేపథ్యంలో ఆసుపత్రి వైద్యులే వారి బాధను అర్థం చేసుకొని తమకు తెలిసిన సంస్థలు, వ్యక్తుల ద్వారా 11లక్షల రూపాయలు సేకరించగా బాలుడి తండ్రి మూడు మూడు లక్షలు భరించాడు. అలీకి ఆపరేషన్ చేసిన వైద్యులు అతని తండ్రి రేహాన్ లివర్లో కొంత భాగాన్ని కుమారుడికి అమర్చారు. ఈ ఆపరేషన్ విజయవంతం అయ్యిందనీ, ఆలీ హమ్జా క్రమంగా కోలుకుంటున్నాడని శస్త్రచికిత్స చేసిన వైద్యుడు డాక్టర్ శరత్ వర్మ ఎఎన్ఐకి తెలిపారు. ఆసుపత్రి నిర్వాహకులు చూపిన మానవత్వాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.