చండీగఢ్: హర్యానాలో బీజేపీ, జననాయక్ జనతాపార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సోమవారం ముఖ్యమంత్రిగా బీజేపీ నేత మనోహర్ లాల్ ఖట్టర్ ప్రమాణ స్వీకారం చేయగా, ఉపముఖ్యమంత్రిగా జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలా ప్రమాణస్వీకారం చేశారు. అయితే, దుష్యంత్ ప్రమాణస్వీకారం చేస్తుండగా చిన్న తప్పిదం జరిగింది. హర్యానా రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి అనడానికి బదులు, ‘భారత్ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి’ అని తప్పుగా అన్నారు. దాంతో గవర్నర్ మరోసారి ఆయన చేత ప్రమాణం చేయించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
JJP's Dushyant Chautala takes oath as the Deputy Chief Minister of Haryana.@Dchautala @JJPofficial@DVJChautala
pic.twitter.com/aR6hGMw2X5— DHAKA SURENDRA (@DhakaSurendra) October 27, 2019
హర్యానాలో ఏర్పడిన హంగ్ అసెంబ్లీ తర్వాత ఒక్కసారిగా అక్కడి రాజకీయాల్లో దుష్యంత్ చౌతాల సంచలనంగా మారారు. జననాయక్ జనతా పార్టీని (జేజేపీ) స్థాపించిన కొద్ది నెలల్లోనే ఆయన అక్కడ కింగ్ మేకర్గా మారారు. ఆయన మద్దతు ఉంటేనే ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితికి రావడంతో చివరకు బీజేపీ అతన్ని దగ్గరకు తీసుకుంది. దీంతో బీజేపీ – జేజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటంతో సోమవారం సీఎంగా మనోహర్లాల్ ఖట్టర్, డిప్యూటీ సీఎంగా దుష్యంత్ చౌతాల ప్రమాణస్వీకారం చేశారు. ఈ సంరద్భంగానే ‘భారత్ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి’ అని తప్పుగా పలికారు. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వారు చాలా మంది ఇలా ప్రమాణస్వీకారం సమయంలో తడబాటు సర్వసాధారణంగా మారిపోయింది. ఇప్పుడు ఆ ఖాతాలోకి దుష్యంత్ కూడా చేరిపోయారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 40 సీట్లు గెలుచుకున్న బీజేపీ.. 10 స్థానాల్లో గెలుపొందిన దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచిన ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీకి మద్దతు తెలిపారు. దీంతో 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో బీజేపీ బలం 57కి పెరిగింది.