న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఎన్నికల కమిషన్ మరోసారి క్లీన్ చిట్ ఇచ్చింది. ఇంతకుముందు వార్ధాలో చేసిన ప్రసంగం కోడ్ ఉల్లంఘన కిందకు రాదని చెప్పిన ఈసీ, తాజాగా లాతూరులో బాలాకోట్ వైమానిక దాడుల ప్రస్తావన కూడా తప్పు కాదని తెలిపింది. అయితే, ఈ విషయంలో మహారాష్ట్ర సీఈవో, ఉస్మానాబాద్ జిల్లా ఎన్నికల అధికారి పంపిన అభిప్రాయాలను కూడా ఈసీ తోసి పుచ్చింది. ఈ విషయాన్ని ‘ద ఇండియన్ ఎక్స్ ప్రెస్’ తెలిపింది. మోదీ బాలాకోట్ వైమానిక దాడుల గురించి ప్రస్తావించారని ఆ ఇద్దరు అధికారులు చెప్పారు. కానీ, ఆ పేరుతో ఓట్లు అడగలేదని ఈసీ స్పష్టం చేసింది.
మొత్తం ప్రసంగంలో ఆ ప్రస్తావన కేవలం ఐదు లైన్లే ఉందని ఈసీ అన్నట్లు ఓ అధికారి చెప్పారు. మొత్తం ప్రసంగాన్ని పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సుర్జేవాలాకు ఈసీ ఒక సమాధానం పంపింది. ‘‘ఈ విషయాన్ని 2013 డిసెంబరు 4 నాటి ఈసీ అడ్వైజరీ నేపథ్యంలో పరిశీలించాం. ఎన్నికల నిబంధనావళి ప్రకారం చూశాం. ఉస్మానాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మొత్తం ప్రసంగం తాలూకు 11 పేజీల రాతప్రతిని పంపారు. అందులో ఏవీ ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కిందకు రావు’’ అని ఈసీ అందులో తెలిపింది. భద్రతాదళాల కార్యకలాపాలను రాజకీయ ప్రచారానికి వాడుకోకూడదని అన్ని పార్టీలకూ మార్చి 19న ఈసీ ఒక లేఖ రాసింది. కానీ బుధవారం నాటి నిర్ణయంతో కాంగ్రెస్ చేసిన ఐదు ఫిర్యాదులలో రెండింటిని ఈసీ క్లియర్ చేసినట్లయింది. తొలిసారి ఓటు వేసేవాళ్లు బాలాకోట్ వైమానిక దాడులలో పాల్గొన్న జవానులకు, పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందినవారికి తమ ఓట్లు అంకితం చేయాలని ఆ ప్రసంగంలో మోదీ అన్నారు. దాన్నే కాంగ్రెస్ సవాలు చేయగా, ఈసీ కొట్టేసింది.