అమరావతి: మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాద్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఆయన కుమారుడు, కుమార్తెలపై పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. తాజాగా ఏపి అసెంబ్లీ ఫర్నీచర్ అపహరణ అంశం తెరపైకి వచ్చింది. హైదరాబాద్ నుండి అమరావతికి అసెంబ్లీ మారే సమయంలో విలువైన ఫర్నీచర్, ఎసిలు మాయం అయ్యాయి. దీనిపై ఇటీవల అసెంబ్లీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అసెంబ్లీకి చేరుకొని అపహరణకు గురైన సామాగ్రి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే మాజీ స్పీకర్ కోడెలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయంపై కోడెల శివప్రసాద్ మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. ఫర్నీచర్ ఎక్కడికి పోలేదనీ, తన వద్దనే ఉందని చెప్పుకొచ్చారు. సరైన భద్రత లేని కారణంగా తన క్యాంప్ కార్యాలయంలో వాటిని వినియోగించడం జరిగిందని చెప్పారు. తన వద్ద ఉన్న ఫర్నీచర్ను తీసుకువెళ్లాలనీ, లేకుంటే వాటికి అయిన ఖర్చు మొత్తం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాననీ అసెంబ్లీ అధికారులకు లేఖ కూడా రాశాననీ, కానీ అసెంబ్లీ అధికారులు తన లేఖపై ఇంత వరకూ స్పందించలేదని కోడెల చెప్పారు. దీనిపై మరో సారి అసెంబ్లీ అధికారులకు లేఖ రాయనున్నట్లు కోడెల తెలిపారు. ఇప్పటికైనా అధికారులు వస్తే ఫర్నీచర్ అప్పగిస్తానని కోడెల స్పష్టం చేశారు.