తిరుపతి: హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయనున్నారని తిరుపతి మాజీ ఎంపి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి నుండి ఎపి రాజధాని మార్చనున్నారనీ, ఈ మేరకు తనకు కేంద్రం నుండి సమాచారం ఉందనీ ఇటీవల వ్యాఖ్యానించిన చింతా మోహన్ నేడు తాజాగా మరో బాంబ్ పేల్చారు. తిరుపతిలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియాతో ఆయన అటు హైదరాబాద్, ఇటు అమరావతిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
లడక్ను కేంద్ర పాలిత ప్రాంతం (యుటి) చేసినట్లుగానే మహారాష్ట్ర ఎన్నికలు అయిన తరువాత తెలంగాణలో ఉన్న హైదరాబాద్ను యుటి చేయనున్నారని చింతా మోహన్ చెప్పారు.
తుళ్లూరులో అడుగుపెట్టడం వల్ల చంద్రబాబు లాగా జగన్ ఫెయిల్ అవుతున్నాడనీ చింతా వ్యాఖ్యానించారు.
‘తిరుపతికి వచ్చేయ్, ఎవరు అడ్డం రారు, జవాబు చెప్పడానికి నీ పక్కన నేను ఉంటా’ అని చింతా అన్నారు.
పరిపాలనా అవసరాలకు అనేక భవనాలు తిరుపతిలో ఖాళీగా ఉన్నాయని చింతా చెప్పుకొచ్చారు. తుళ్లూరు వద్దు తిరుపతికి రమ్మనమని జగన్ను ఆహ్వానిస్తున్నానని చింతా అన్నారు. తిరుపతిలో రాజధాని పెడితే జగన్ సక్సెస్ అవుతారని చింతా జోస్యం చెప్పారు.
సచివాలయం, సిఎం క్యాంప్ ఆఫీసు, రాజ్భవన్ తదితర కార్యాలయాలకు అవసరమైన భవనాలు ఉన్నాయని చెబుతూ అడ్మిషన్లు లేక ఏడు ఎనిమిది ఇంజనీరింగ్ కళాశాలలు కూడా ఖాళీగా ఉన్నాయని వాటిని ఖాళీ చేయించి తక్కువ అద్దెతో ఇప్పించే బాధ్యత తీసుకుంటానని చింతా చెప్పారు. ఖర్చు లేకుండా రాజధాని అయిపోతుందని చింతా పేర్కొన్నారు.
చింతా వ్యాఖ్యలపై అటు తెలంగాణ సిఎం కెసిఆర్, ఇటు ఎపి సిఎం వైఎస్ జగన్ ఎ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.