(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
శ్రీలంకలో నిర్వహించిన ఓ మతపరమైన పండగలో రెండు ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఏనుగుపై కూర్చున్న ఆలయ సంరక్షకుడుతోపాటు సుమారు 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. శ్రీలంక రాజధాని కొలంబోలో శనివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. కొలంబోలోని బుద్ధిస్టులు ఓ పండగను నిర్వహించారు. ఆ ఉత్సవాల ఊరేగింపు కోసం రెండు ఏనుగులను అద్దెకు తీసుకున్నారు. అయితే రెండు ఏనుగులు ఉన్నట్టుండి పరుగులు పెట్టాయి. పండగలో పాల్గొన్న వారిని తోసుకుంటూ, తరుముకుంటూ, తొండంతో కొడుతూ నానా హంగామా చేశాయి. దీంతో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఏనుగులకు భారీ వస్త్రాన్ని, కాళ్లను కట్టి వేస్తూ సంకెళ్లను, నడవడానికి కూడా వీలు లేకుండా ఉండే అంతగా భారీ ఆభరణాలు వేసి అలంకరించారు. వెలుగు జిలుగులు, భారీ శబ్ధాల మధ్య వాటిని ఊరేగింపుకు తీసుకెళ్లారు. దీంతో భయపడిన ఏనుగులు ఉన్నట్టుండి పరుగులు పెట్టిందని ఏనుగుల ట్రైనర్ జయంత జయవర్దనే అన్నాడు. ఆ ఏనుగులు ఎప్పుడూ జన సంచారం అధికంగా ఉండే కార్యక్రమంలో పాల్గొనలేదని తెలిపాడు. ఆలయ అధికారులు కూడా ఏనుగులకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిగా విస్మరించారని, అందుకే ఇలా జరిగిందని చెప్పారు.
https://youtu.be/0WfUh_pzX_E
మూడు సంవత్సరాల క్రితం ఇలాంటి ఓ ఆలయ వేడుకలో కూడా రెండు ఏనుగులు ఘర్షణ పడ్డాయి. ఈ సందర్భంగా ఓ మహిళ మరణించగా.. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. అధికారుల రికార్డుల ప్రకారం దేశంలో 200 పెంపుడు ఏనుగులు ఉన్నాయి.