లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అయోధ్యలో రాముడి గుడి నిర్మించడానికి చట్టం తీసుకురావాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈ తరుణంలో ఆశ్చర్యకరంగా బాబ్రీ మసీదు ఒకప్పుడు ఉన్న వివాదాస్పద స్థలం చుట్టుపక్కల కేంద్రం అధీనంలో ఉన్న భూమిని తిరిగి ఇచ్చేయటానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు చెప్పింది.
హిందుత్వ కార్యకర్తలు అక్కడ ఉన్న మసీదుని 1992 డిసెంబర్ ఆరున కూలగొట్టారు. ఆ స్థలం చుట్టుపక్కల ఉన్న 67 ఎకరాల భూమిని 1993లో చట్టం ద్వారా నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సేకరించింది. ఎం. ఇస్మాయిల్ ఫరూఖీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్టు ఆ సేకరణని సమర్ధించింది. మత సామరస్యం నిలబెట్టడానికి, 0.313 ఎకరాల వివాదాస్పద భూమికి ఎటువంటి ఆటంకాలు ఎదురవ్వకుండా ఉండడానికి ఆ భూమి సేకరించడం అవసరం అని 1993 లో కేంద్రం వాదించింది.
కానీ సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పింది ఏమిటంటే ‘అయోధ్యలో నిర్దిష్ట ప్రాంతాల సేకరణ చట్టం, 1993’ (Acquisition of Certain Areas at Ayodhya Act, 1993) ప్రకారం ఆ సేకరించిన భూమికి కేంద్ర ప్రభుత్వం కేవలం సంరక్షకురాలు మాత్రమే, బాబ్రీ మసీదు స్థలం కేసులో భూమి స్వంతదారులు ఎవరు అని నిర్ధారణ జరిగాక ఆ అదనపు భూమి స్వంతదారులకి తిరిగి అప్పగించాలి అని. బాబ్రీ మసీదు స్థలం కేసు ప్రస్తుతం ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందు సుప్రీం కోర్టులో అప్పీలు రూపంలో ఉంది. వివాదాస్పద స్థలం దగ్గర యథాతధ స్థితిని కొనసాగించాలని సుప్రీం కోర్టు 2003 లోను, 2011లోను పునరుద్ఘాటించింది.
67 ఎకరాలలో తమకి చెందిన 42 ఎకరాలు తమకి తిరిగి అప్పగించాలని రామజన్మభూమి న్యాస్ చేస్తున్న డిమాండ్ పట్ల తమకి ఎటువంటి అభ్యంతరం లేదని కేంద్రం మంగళవారం నాడు సుప్రీం కోర్టులో అర్జీ దాఖలు చేసింది. కాకపోతే ఈ అర్జీలో కేంద్రం చెప్పని విషయం ఏమిటంటే రామజన్మభూమి న్యాస్ కి ఈ 42 ఎకరాలు ఎలా వచ్చాయి అన్నది. ఆ వచ్చిన పద్ధతే చట్ట వ్యతిరేకమన్న విమర్శలు అనేక సంవత్సరాలుగా వినబడుతున్నాయి.
అదనపు భూమి
రాజ్యాంగ నిపుణుడు ఎ.జి.నూరాని ప్రకారం, బాబ్రీ మసీదు కూల్చివేతకి కొన్ని నెలల ముందు ఉత్తరప్రదేశ్ లో అప్పటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రామజన్మభూమి న్యాస్ కి ఈ 42 ఎకరాలని సుదీర్ఘ కాలానికి లీజుకి (Perpetual Lease) ఇచ్చింది.
“రామ కథ పార్క్” కట్టడానికి పర్యాటక శాఖ ద్వారా న్యాస్ కి ఈ భూమిని ఒక రూపాయి నామమాత్రపు ధరకి సుదీర్ఘ కాలానికి లీజుకి ఇచ్చింది. అనేక సంవత్సరాలుగా విమర్శకులు చెబుతున్నది ఏమిటంటే ఈ భూమి మీద గుడి కట్టే ప్రయత్నాలు లీజు ఒప్పందానికి వ్యతిరేకం అని.
నూరాని చెప్పినట్టు,ఈ 42 ఎకరాలలో కేవలం ఒక ఎకరం మాత్రమే న్యాస్ సొంతభూమి అని 2002లో లోక్సభలో ఆనాటి ప్రధాని అటల్ బిహారి వాజపేయి పేర్కొన్నారు. 1992లో అప్పటి కేంద్ర హోం శాఖ మంత్రి ఎస్.బి.చవాన్ ఈ భూమి గురించి పార్లమెంట్లో దీర్ఘంగా ప్రసంగించారు. వారి మాటల్లోనే:
“ రామకథ పార్క్ ప్రాజెక్ట్ గురించి రాష్ట్ర ప్రభుత్వం తెలియచేసింది ఏమిటంటే పూర్వపు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ కోసం 1989 వరకు మొత్తం 52.90 ఎకరాలు సేకరించింది. ఈ భూమి గురించి కోర్టులో ఎటువంటి వివాదం లేదు. అలాగే భూమి స్వంతదారులకి పరిహారం లభించింది. పూర్వపు ప్రభుత్వం పర్యాటకం అభివృద్ధి కోసం రామకథ పార్క్ ప్రాజెక్ట్ తయారుచేసింది కాని అమలు చెయ్యలేకపోయింది. ఢిల్లీకి చెందిన రామజన్మభూమి న్యాస్ తమ సొంత వనరులతో ఈ ప్రాజెక్ట్ని అమలు చేస్తామని ప్రతిపాదించింది. తదనుగుణంగా ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం ప్రకారం పర్యాటక శాఖ రామజన్మభూమి న్యాస్ కి ఈ ప్రాజెక్ట్ అమలు కోసం 42.09 ఎకరాలు లీజుకి ఇచ్చింది.”
అయితే, మంగళవారం దాఖలు చేసిన పిటిషన్ లో కేంద్ర ప్రభుత్వం రామజన్మభూమి న్యాస్, ఇతరులని “అసలైన యజమానులుగా” గుర్తించింది. లీజు ఇచ్చిన సందర్భాన్ని బట్టి చూస్తే ఈ భూమి యొక్క అసలైన యజమాని ఉత్తప్రదేశ్ ప్రభుత్వం. నూరాని పేర్కొన్నట్టు 2002లో పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేత పత్రంలో కూడా ఈ లీజు తాలుకా నిబంధనలు ఉన్నాయి.
లీజు ఉల్లంఘన, ప్రతిపాదిత ఆలయం
మార్చ్, 2002 ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం ప్రకారం “ ప్రభుత్వం 42.09 ఎకరాలు లీజుకి ఇచ్చిన తరువాత….రామజన్మభూమి న్యాస్, విశ్వ హిందూ పరిషత్ చేసిన మొదటి పని అక్కడ ఉన్న కొన్ని చిన్న గుళ్లను, ముస్లిం మతస్థుల శ్మశానాన్ని కూలగొట్టడం.”
ఎస్.ఆర్.బొమ్మై అధ్యక్షుడిగా ఉన్న జాతీయ సమగ్రతా మండలి (National Integration Council) అయోధ్య వివాదం మీద 1992లో ఈ కింది విధంగా పేర్కొంది.
“ బాబ్రీ మసీదుకి మూడు వైపులా ఒక పురాతన శ్మశానం, ఆ శ్మశానం మీద కాజీ కిద్వా సమాధితో సహా పక్కా, కచ్చా సమాధులు వేల సంఖ్యలో ఉన్నాయి. ఈ సమాధులు అన్ని మొన్నటి వరకు ఉన్నాయి. కాజీ కిద్వా సమాధితో సహా మిగతా సమాధులని రాష్ట్ర ప్రభుత్వం మార్చి 20, 1992 తర్వాతే కూలగోట్టింది.”
పైన పేర్కొన్న నివేదికలు అన్ని వివాదాస్పద స్థలంలో గుడి నిర్మాణానికి ఆ స్థలం చుట్టూ ఉన్న భూమిని ఏ విధంగా వాడుకోటానికి ప్రయత్నించారో తెలియచేస్తున్నాయి. మంగళవారం నాడు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వెయ్యగానే సుబ్రమణ్య స్వామి ఈ కింది విధంగా ట్వీట్ చేశారు.
“ రామజన్మభూమి లో ఇప్పటికే ఒక రాముడి గుడి ఉంది. కాకపోతే అది టెంట్ లోపల ఉంది. స్థల యాజమాన్యం కేసు తేలే లోపల గుడి మిగతా భాగాలు నిర్మిస్తాము. కేసు తేలాక గర్భగుడి నిర్మిస్తాము.”
రాముడి గుడి నిర్మించాలి అని రోజు రోజుకి పెరుగుతున్న డిమాండ్ల తరుణంలో ఆ స్థలం చుట్టూ ఉన్న భూమి రామజన్మభూమి న్యాస్కి, ఇతరులకి తిరిగి అప్పగించాలంటూ వేసిన పిటిషన్ కేంద్రం ఉద్దేశం గురించి అనేక ప్రశ్నలకు తావిస్తోంది. భూసేకరణకి సుప్రీం కోర్టు 1993 లో ఇచ్చిన సమర్ధన వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఎటువంటి మత ఘర్షణలకి ఆస్కారం ఉండకూదు అని. అయోధ్య వివాదం నేడు ఉన్న పరిస్థితుల్లో హింసకి ఆస్కారం ఉంది అనే భయాందోళనలు ఉన్నాయి. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే లీజుకి ఇచ్చిన భూమిని తమకి అప్పగించమని న్యాస్ మొదటిసారిగా 1996లోనే నివేదించుకుంది. అక్కడ యథాతథ స్థితి కొనసాగించమని సుప్రీమ్ కోర్ట్ 2003, 2011 లో రెండు సార్లు ఉత్తర్వులు జారి చేసింది.
ఇప్పుడు కేంద్రం వక్రీకరణ తర్కం వాడి అక్కడ ఉన్న పరిస్థితులని పట్టించుకోకుండా వివాదాస్పద స్థలం 0.313 ఎకరాలే కాబట్టి మిగతా భూమిని యజమానులకి ఇచ్చేయ వచ్చని వాదిస్తున్నది.
– స్క్రోల్ వెబ్సైట్ నుంచి పునర్ముద్రితం