ముంబాయి: మహారాష్ట్ర బిజెపి శాసనసభాపక్ష నేతగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మరో సారి ఎన్నికయ్యారు. విధాన్ భవన్లో బుధవారం జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన 105మంది బిజెపి ఎమ్మెల్యేలు ఫడ్నవీస్ను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఫడణవీస్ మాట్లాడుతూ రాష్ట్రంలో బిజెపి, శివసేన కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని అన్నారు. మిత్రపక్షంతో ఏర్పడిన భేదాభిప్రాయాలు త్వరలోనే తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ మరో సారి సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేకు ఫడ్నవీస్ కృతజ్ఞతలు తెలిపారు.
మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు విషయమై బిజెపి, శివసేన మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. సిఎం పదవిని చెరిసగం పంచుకోవాల్సిందేనని శివసేన గట్టిగా పట్టుపడుతున్న నేపథ్యంలో అయిదేళ్లు తానే సిఎంగా ఉంటానని ఫడ్నవీస్ ప్రకటించిన విషయం విదితమే.
అయితే శివసేనకు డిప్యూటి సిఎంతో పాటు 13 మంత్రి పదవులను బిజెపి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. సిఎం పదవితో పాటు 26 మంత్రి పదవులను బిజెపి తీసుకుంటోందని చెబుతున్నారు. బిజెపి ఆఫర్పై శివసేన ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. గురువారం ఆ పార్టీ ఎమ్మెల్యేలతో శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే సమావేశం అవ్వనున్నారు. ఈ సమావేశంలో బిజెపి చేసిన ప్రతిపాదనపై చర్చించే అవకాశం ఉంది.