(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ తోపాటు మరో ఇద్దరిపై చీటింగ్ కేసు నమోదైంది. ఔరంగాబాద్లోని ఒక ట్రావెల్స్ యజమానిని మోసం చేసిన కేసులో అజార్ సహా మరో ఇద్దరు ముజీబ్ ఖాన్, సుధీష్ అవాక్కల్పై ఎఫ్ఐఆర్ నమదైనట్లు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పోలీసులు తెలిపారు.
పెద్దమొత్తంలో విమాన టికెట్లు తనతో బుక్ చేయించి వాటి డబ్బు చెల్లించలేదంటూ ఔరంగాబాద్ కు చెందిన షాహెబ్ మొహమ్మద్ అనే ట్రావెల్ ఏజెంటు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివిధ ప్రాంతాల్లో పర్యటించేందుకు 2019 నవంబర్ 9 నుండి 12 వరకు టికెట్లు బుక్ చేసుకున్నారని కానీ డబ్బులు మాత్రం చెల్లించలేదని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
గత ఏడాది నవంబరులో సుధీష్ అవాక్కల్ అనే వ్యక్తి షాహెబ్ ద్వారా విమాన టికెట్లు బుక్ చేయించాడు. ఈ టికెట్లపై సుధీష్ తోపాటు అజారుద్దీన్ ప్రయాణించారు. టికెట్లు బుక్ చేయమన్నప్పుడు అత్యవసరంగా ప్రయాణం ఉందని, ప్రస్తుతానికి డబ్బు తనవద్ద లేదని, టికెట్ల డబ్బు తర్వాత ఇస్తానని సుధీష్ ఆ సమయంలో చెప్పాడు. ఆ డబ్బుకు తాము హామీ అని అజారుద్దీన్ వ్యక్తిగత సిబ్బంది మజీబ్ ఖాన్ తెలిపారు. దీంతో తాను రూ.20 లక్షలు ఖర్చు చేసి టికెట్లు బుక్ చేశానని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
అయితే ఈ ఆరోపణలను అజారుద్దీన్ ఖండించారు. తానెవరినీ ఎటువంటి మోసం చేయలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో వీడియోను షేర్ చేశారు. తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అర్థం లేనిదన్నారు. తప్పుడు ఆరోపణలపై కేసు ఎలా నమోదు చేస్తారని ఆయన ప్రశ్నించారు. తాను ఎవరిని మోసం చేయలేదని తెలిపారు. తనపై బురద జల్లేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, దీనిపై తన న్యాయవాదితో మాట్లాడుతున్నట్లు చెప్పారు. తనపై అసత్య ఆరోపణలు చేసిన వారిపై పరువునష్టం దావా వేస్తానని పేర్కొన్నాడు. దీన్ని న్యాయపరంగా ఎదుర్కొంటానని అజారుద్దీన్ తెలిపారు.
I strongly rubbish the false FIR filed against me in Aurangabad. I’m consulting my legal team, and would be taking actions as necessary pic.twitter.com/6XrembCP7T
— Mohammed Azharuddin (@azharflicks) January 22, 2020