అమరావతి, ఏప్రిల్ 21: ముఖ్యమంత్రి చంద్రబాబుపై కత్తికట్టిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారులు వెనక్కుతగ్గేలా కనబడటం లేదు. సీనియర్ ఐఎఎస్ అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యల దుమారం ఇప్పట్లో చల్లారే పరిస్థితి కనబటడం లేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యం, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిలపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను రిటైర్డ్ అధికారులు తప్పుబడుతూ గవర్నర్ నర్శింహంను కలిసి ఫిర్యాదు కూడా చేశారు. ఇప్పటి వరకూ హైదరాబాదులో సమావేశాలు నిర్వహించి చంద్రబాబు వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రకటనలు ఇచ్చిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారులు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై దిగిరాకపోవడంతో అమరావతి కేంద్రంగా భవిష్యత్తు కార్యాచరణకు రిటైర్డ్ ఐఎఎస్లు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నెల 23న సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ సమావేశానికి రాష్ట్రంలోని రిటైర్డ్,వర్కింగ్ ఐఎఎస్ అధికారులను ఆహ్వనిస్తున్నట్లు సమాచారం. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు నేతృత్వంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. రిటైర్డ్ ఐఎఎస్లు అజయ్ కల్లం, గోపాల్రావు, భట్టాచార్య తదితరులు బాహటంగా చంద్రబాబు వ్యాఖ్యలను తప్పుబడుతూ బయటకు రాగా పలువురు రిటైర్డ్ ఐఎఎస్లు వీరిని సమర్థిస్తున్నారు. సర్వీసులో ఉన్న ఐఎఎస్లను ఈ సమావేశానికి ఆహ్వానించినప్పటికీ ఎంత మంది బాహాటంగా మద్దతు తెలుపుతారన్నది అనుమానాస్పదమే. ఈ సమావేశం ద్వారా రిటైర్డ్ ఐఎఎస్ అధికారులు ఏ మేరకు విజయం సాధిస్తారో వేచి చూడాల్సి ఉంది.
ఎన్నికల సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్వి సుబ్రమణ్యంను నియమించి అప్పటి వరకు ఉన్న సీనియర్ ఐఏఎస్ అనిల్చంద్ర పునేఠాను బదిలీ చేయడంతో పాటు పలువురు ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల బదిలీల్లో ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవటాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుబట్టిన విషయం విదితమే.
నిజాయతీపరులైన సీనియర్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసినప్పుడు వీరు (రిటైర్డ్ ఐఎఎస్ అధికారులు) ఎందుకు మాట్లాడలేదని సిఎం చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు.