న్యూఢిల్లీ: క్రికెట్ లో పలుమార్లు తాను కొట్టిన షాట్లను ఫీల్డర్ వదిలేయడంతో లైఫ్ లభించిన గౌతమ్ గంభీర్ కు.. ఎన్నికల మైదానంలో కూడా అలాగే లైఫ్ లభించింది. చిన్న సాంకేతిక సమస్యతో అతడి నామినేషన్ తిరస్కరణకు గురి కావాల్సింది.. తృటిలో ప్రమాదం తప్పింది. ప్రత్యర్థులు వ్యక్తం చేసిన అభ్యంతరాలను ఎన్నికల అధికారి తోసిరాజన్నారు. గంభీర్ నామినేషన్ అంతా సక్రమంగానే ఉందన్నారు. నామినేషన్ పరిశీలన సమయంలో ఆప్ అభ్యర్థి అతిషి మర్లోనా తన న్యాయవాది అనిష్ దయాల్, మంజిత్ సింగ్ లతో కలిసి అభ్యంతరం వ్యక్తంచేశారు. మొదటి అఫిడవిట్ మీద 18/04 అని, రెండో అఫిడవిట్ మీద 19/04 అని రెండు తేదీలున్నాయని చెప్పారు. కానీ స్టాంపు పేపరు మాత్రం 23.04 తేదీతో ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అర్వీందర్ సింగ్ లవ్లీ కూడా ఇవే అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే.. 18/04, 19/04 అనేవి సీరియల్ నంబర్లు మాత్రమేనని, నోటరీ స్టాంపు తేదీ 23.04 అని గంభీర్ తరఫు న్యాయవాది చెప్పడంతో ఎన్నికల అధికారి ఆ వాదనతో సంతృప్తి చెందారు.
క్రికెట్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన గౌతమ్ గంభీర్.. ఢిల్లీలో రోడ్ షో నిర్వహించారు. తాను గతంలోనే క్రికెటర్ అని, ఇప్పుడు కాదని ఆయన అన్నారు. ఇప్పుడు తన కళ్లెదుట ఉన్నది పూర్తిగా వేరే ఫీల్డ్ అని, కొత్త సవాలని అన్నారు. దేశానికి, సమాజానికి ఏదైనా మంచి చేయాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. గంభీర్ ఎప్పటినుంచో బీజేపీ ప్రభుత్వ విధానాలకు మద్దతుదారుగా ఉండేవారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్వయంగా ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. తూర్పు ఢిల్లీలో సిట్టింగ్ ఎంపీ మహేష్ గిరి స్థానంలో గంభీర్ కు అవకాశం దక్కింది.