(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
హైదరాబాద్ ఎన్కౌంటర్ పుణ్యమా ఆని విచిత్రాలు జరుగుతున్నాయి. ఇతర అత్యాచారం బాధితుల కుటుంబసభ్యులు తమ వాళ్ల కేసుల్లోని నిందితులను కూడా ఎన్కౌంటర్లో అంతమొందించాలని డిమాండ్ చేస్తుండగా, ఉత్తరప్రదేశ్ పోలీసులు తాము ఎంతమందిని ఇప్పటివరకూ ఎన్కౌంటర్ చేసిందీ చిట్టా విప్పారు.
ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇలా తమ ఘనతను చాటుకోవడానికి కారణం బహుజన్ సమాజ్ పార్టీ నేత మాయావతి వ్యాఖ్యలు. ఉన్నావ్ అత్యాచారం బాధితురాలి మరణం తర్వాత మాయావతి హైదరాబాద్ పోలీసులను హీరోలుగా అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్ పోలీసులు నేరస్థులను ప్రభుత్వ అతిధులుగా చూస్తున్నారనీ, వారు హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలనీ ఆమె వ్యాఖ్యానించారు.
దానికి ఉత్తరప్రదేశ్ పోలీసులు స్పందించారు. యోగీ ఆదిత్యనాధ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తాము గత రెండేళ్ల పైచిలుకు కాలంలో 103 మంది నేరస్థులను ఎన్కౌంటర్ల ద్వారా మట్టు పెట్టినట్లు పోలీసు విభాగం ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ‘5,178 ఎన్కౌంటర్ సంఘటనలలో 103 మంది క్రిమినల్స్ మరణించారు. 1,859 మంది గాయపడ్డారు. 17,745 మంది లొంగిపోవడమో, లేక తమ బెయిల్ తామే రద్దు చేసుకుని మళ్లీ జైలుకు వెళ్లడమో జరిగింది’ అని తెలిపారు. ఆదిత్యనాధ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసులు నేరస్థులను అరెస్టు చేయకుండా విచ్చలవిడిగా ఎన్కౌంటర్లలో హతమారుస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి.
‘రాష్ట్రంలో పరిస్థితిని ఈ సంఖ్యలే చెబుతున్నాయి. జంగిల్ రాజ్ అనేది గతంలో మాట. ఇప్పుడు కాదు’s అని ఉత్తరప్రదేశ్ పోలీసు విభాగం వ్యాఖ్యానించింది. 23 ఏళ్ల ఉన్నావ్ రేప్ కేసు బాధితురాలు డిసెంబర్ అయిదు ఉదయం కోర్టుకు వెళుతుండగా ఆమెపై అత్యాచారం చేసిన ఇద్దరు వ్యక్తులూ, మరో ముగ్గురూ కలిసి దారిలో ఆమెను అటకాయించి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఢిల్లీ సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో ఆమె మరుసటి రోజు కన్నుమూసింది.