భారత వైమానిక దళాలు జరిపిన మెరుపు దాడులపై చర్చించేందుకు పాకిస్తాన్ పార్లమెంట్ బుధవారం అత్యవసర సమావేశం కానుంది. పార్లమెంట్లోని ఉభయ సభల సభ్యులు సమావేశానికి తప్పక హాజరుకావాలని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదేశాలను జారీ చేశారు.
భారత దాడికి ఏ విధంగా సమాధానం ఇవ్వాలన్న దానిపై పార్లమెంట్లో చర్చించే అవకాశం ఉంది. ఇదిలావుండగా భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్లో ఎంపీలు నినాదాలు చేస్తున్నారు. వైమానిక దాడులకు సమాధానం ఇవ్వాలని ప్రతిపక్ష ఎంపీలు ఇమ్రాన్ను డిమాండ్ చేస్తున్నారు.
మెరుపు దాడులతో పాక్ అప్రమత్తమైంది. పరిస్థితిని సమీక్షించేందుకు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ జాతీయ భద్రతా దళం(ఎన్ఎస్సీ)తో అత్యవసర సమావేశమయ్యారు. అనంతరం ఎన్ఎస్సీ దాడులను ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. భారత్ దాడులపై తాము సమయం, సందర్భం చూసుకొని సరైన సమాధానమిస్తామని ప్రకటనలో పేర్కొంది.
‘బాలాకోట్ సమీపంలో ఉగ్రవాద స్థావరాలంటూ భారత్ చేసిన దాడులను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. మరోసారి భారత్ కల్పిత కథలు చెబుతూ నిర్ల్యక్షంగా వ్యవహరించింది. ఆదేశ ఎన్నికల వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని భారత్ ఈ విధమైన చర్యకు దిగింది. భారత్ బాధ్యతారాహిత్యమైన ప్రవర్తనను ప్రపంచ నేతల ఎదుట బహిర్గతం చెయ్యాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిర్ణయించుకున్నారు’ అని ఎన్ఎస్సీ తన ప్రకటనలో పేర్కొంది.
పాక్ త్వరలో తీసుకోబోయే అన్ని చర్యలకు సైన్యం, దేశ ప్రజలు సంసిద్ధంగా ఉండాలని ప్రధాని ఇమ్రాన్ఖాన్ సూచించినట్లు ఎన్ఎస్సీ తెలిపింది.
మరోవైపు వాస్తవాదీన రేఖను దాటి భారత విమానాలు నియంత్రరేఖను ఉల్లంఘించాయని పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి ఆశ్రయించే అవకాశం ఉంది.