ఇస్లామాబాద్: నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళాలు జరిపిన దాడులపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ తీవ్రంగా స్పందించారు. భారత్ దూకుడుగా వ్యవహరిస్తోంది.. తాము కూడా తగిన విధంగా బదులిస్తామని హెచ్చరించారు.
భారత వైమానిక దళాలు మంగళవారం తెల్లవారుజామున పాకిస్థాన్లోని మూడు ఉగ్రవాద శిబిరాలపై 1000కిలోల బాంబులను విసిరి వాటిని ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ.. నియంత్రణ రేఖను దాటి దాడి చేయడం నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని ఖురేషీ అన్నారు.
‘పాకిస్థాన్కు ఆత్మ రక్షణ చేసుకునే హక్కు ఉంది. మేము కూడా ధీటుగానే స్పందిస్తాం’ అని భారత్ ఉద్దేశించి ఖురేషీ హెచ్చరించారు. పాకిస్థాన్తో పెట్టుకోవద్దు.. ఎలాంటి దుస్సాహసం చేసినా తగిన విధంగా స్పందిస్తామని అన్నారు. అంతేగాక, ఈ ప్రాంతంలో శాంతియుత వాతావరణాన్ని భారత్ చెడగొడుతోందని ఖురేషీ ఆరోపించారు. పాకిస్థాన్ టెహ్రీక్ ఇన్షాఫ్(పీటీఐ) ఆయన ప్రకటనను ట్విట్టర్లో పోస్టు చేసింది.
Minister of Foreign Affairs Shah Mahmood Qureshi talks to Samaa News after the violation of LOC by Indian Air Force (26.02.19)@SMQureshiPTI
Foreign Minister Shah Mahmood Qureshi warned India not to challenge Pakistan.
Pakistan is fully prepared to respond to any misadventure. pic.twitter.com/mobpNBTgtO— PTI (@PTIofficial) February 26, 2019
ఇది ఇలా ఉండగా, భారత మెరుపు దాడి నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కేబినెట్ మంత్రులు, అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. తాజా పరిస్థితిపై చర్చించారు. దాడి ఘటనతో పాక్ పౌరులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా ప్రధాని వ్యాఖ్యానించారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇమ్రాన్ తన జపాన్ పర్యటనను వాయిదా వేసుకున్నట్లు సమాచారం.