ప్రమాదకరమైన నిపా వైరస్ గత సంవత్సరం కేరళలో విశ్వరూపం చూపించడంతో 17 మంది మరణించారు. అయితే, అక్కడున్న ఒక దర్గాను సరిగా పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరిగిందన్న ప్రచారం ఇప్పుడు మొదలైంది. దాంతో ఆ దర్గాను దర్శించుకోడానికి జనం వెల్లువెత్తుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తి సమాధిగా ఉన్న ఆ ప్రాంతాన్ని కోజికోడ్ జిల్లా సూప్పిక్కడ గ్రామంలోని ముస్లింలు దర్గా అని పిలుస్తారు. దాన్ని చాలాకాలం నిర్లక్ష్యం చేశారని, అందుకే వైరస్ వ్యాపించిందని వాళ్లంటున్నారు. అయితే, ప్రైవేటు భూమిలో ఉన్న ఈ సమాధికి ప్రాచుర్యం కల్పించి సొమ్ము చేసుకోడానికే ఇలా ప్రచారం చేస్తున్నారని అక్కడున్న ఇతరులు దీన్నో మూఢనమ్మకంగా కొట్టిపారేస్తున్నారు.
స్థానిక మసీదు కమిటీ మాత్రం ఈ విషయంలో తటస్థ వైఖరి తీసుకుంది. ఈ వ్యవహారంపై సమస్త కేరళ జమియ్యాతుల్ ఉలేమా విచారణకు ఆదేశించడంతో ఆ నివేదిక కోసం మసీదు కమిటీ వేచి చూస్తోంది. గ్రామం వెలుపలి నుంచి వచ్చిన విరాళాలతో దర్గా ఏర్పాటైందని ఒక ఇమాం అంటున్నారు. గత సంవత్సరం సరిగ్గా ఇదే సమయంలో.. మే – జూన్ నెలల్లో నిపా వైరస్ వ్యాపించింది. సూప్పిక్కడ గ్రామంలోని వలచుకెట్టిల్ కుటుంబానికి చెందిన మహ్మద్ సబిత్ అనే వ్యక్తి ఈ వైరస్ తో మే 10న మరణించాడు. తర్వాత మణిపాల్ సెంటర్ ఫర్ వైర్ రీసెర్చికి చెందిన డాక్టర్ అరుణ్ కుమార్ దీనిపై పరిశోధించారు. గ్రామంలోని గబ్బిలాల వల్లే ఇది వచ్చిందని నిర్ధరించారు. సబిత్ (22) విషయంలో నిపా వైరస్ ఉందని అధికారికంగా నిర్ధరించలేదు. దాన్ని గుర్తించడానికి ముందే అతడి మృతదేహాన్ని ఖననం చేశారు. అతడి తండ్రి మూసా, అన్న సలిహ్, అత్త మరియం కూడా ఇదే వైరస్ కారణంగా మరణించారు.
సబిత్ ఇంటికి సరిగ్గా 100 మీటర్ల దూరంలో దర్గా ఉంది. అప్పుడు కేవలం ఒక సమాధిగా ఉన్న దానిపై రెండు నెలల క్రితం కొందరు స్థానికులు ఒక చిన్న హాలు కట్టి, బయట జెండా పెట్టి హడావుడి మొదలుపెట్టారు. ఇక్కడకు 50 కి.మీ. దూరంలో ఉన్న కోజికోడ్ నగరం నుంచి కూడా ఇక్కడకు జనం రావడం మొదలుపెట్టారు. సమాధిని పట్టించుకోకపోవడం వల్లే వైరస్ వచ్చిందని కొందరు ప్రచారం చేశారని వలచుకెట్టిల్ కుటుంబానికి చెందిన మొయితీన్ కున్హి చెప్పారు. ఇదంతా మూఢనమ్మకమేనని, దర్గా అభివృద్ధికి తాము ఏమీ ఇవ్వలేదని అన్నారు. వైరస్ వచ్చిన కుటుంబంలో కొందరితో తాను కలిసే ఉన్నా, తనకు ఏమీ రాలేదని కున్హి (61) అన్నారు. చిన్న తనంలో తాను ఒకటి రెండు సార్లు అక్కడకు వెళ్లానని, అక్కడ ఎవరిని పాతిపెట్టారో ఎవరికీ తెలియదని చెప్పారు. కొంతమంది వ్యక్తులు ఇప్పుడు దాంతో డబ్బు చేసుకోవాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అబ్దుల్లా అనే వ్యక్తికి చెందిన కొబ్బరితోటలోనే ఈ సమాధి ఉంది. అది కొన్ని దశాబ్దాల నుంచి ఉందని, ఎవరిదో తెలియదని ఆయన అన్నారు. సమాధిని పట్టించుకోకపోవడం వల్లే వైరస్ వచ్చిందని చాలామంది నమ్ముతున్నట్లు ఆయన భార్య నబీసా చెప్పారు. శుక్రవారం సుమారు 20 మంది వచ్చారని, తాము మాత్రం దర్గాలో డబ్బులేమీ వసూలు చేయడం లేదని ఆమె తెలిపారు.
ఈ దర్గా విషయంలో స్థానిక ముస్లింలు మాత్రం విడిపోయారు. ఒక వర్గం దర్గాకు వ్యతిరేకంగా ఉండగా మరో వర్గం కట్టాలని పట్టుబడుతోంది. మసీదు కమిటీ ఏమీ చెప్పకుండా మౌనం పాటిస్తోంది. తాము ఎలాంటి మూఢ నమ్మకాలను ప్రోత్సహించబోమని, కానీ ఈ విషయంలో ఎవరి స్వేచ్ఛ వారిదని జుమా మసీదు ఇమాం బషీర్ బఖావి అన్నారు. త్రిసభ్య కమిటీ దీనిపై విచారణ జరుపుతోందని, ఉలేమాల సంఘం తుది నిర్ణయం చెప్పాక దాన్ని బట్టి చూస్తామని సమస్త కేరళ జమియ్యాతుల్ ఉలేమాకు చెందిన నజీర్ ఫైజీ చెప్పారు.