(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇండియా వాదనకు మద్దతు లభించింది. గూఢచర్యం ఆరోపణలపై పాకిస్థాన్ జైలులో మగ్గుతున్న కులభూషణ్ జాదవ్ మరణశిక్షను అంతర్జాతీయ న్యాయస్థానం సస్పెండ్ చేసింది. జాదవ్ కేసును పునసమీక్షించాల్సిందిగా పాకిస్థాన్ను ఆదేశించింది.
జాదవ్కు పాకిస్థాన్ మిలటరీ కోర్టు విధించిన శిక్షపై హేగ్ లోని అంతర్జాతీయ కోర్టులో ఇండియా అప్పీలు చేసింది. శిక్షను సస్పెండ్ చేయాలన్న నిర్ణయాన్ని న్యాయస్థానంలోని 16 మంది జడ్జిలలో 15 మంది బలపరిచారు. కోర్టులో బుధవారం బహిరంగంగా తీర్పు చదివి వినిపించారు.
జైలులో జాదవ్ను కలిసేందుకు భారత దౌత్య సిబ్బందిని అనుమతించాలని న్యాయస్థానం ఆదేశించింది. జాదవ్కు విధించిన శిక్షను పాకిస్థాన్ సవ్యంగా పునసమీక్షించాలని తీర్పులో పేర్కొన్నది.
జాదవ్ను పాకిస్థాన్ 2016 మార్చ్లో అరెస్టు చేసింది. మాజీ నౌకాదళం ఉద్యోగి అయిన కులభూషణ్ జాదవ్ పాక్ భూభాగంలో గూఢచర్యానికీ, ఉగ్రవాద కార్యకలాపాలకూ పాల్పడ్డాడని పాకిస్థాన్ ఆరోపించింది. అరెస్టయిన ఏడాది తర్వాత జాదవ్కు సైనిక కోర్టు మరణశిక్ష విధించింది. కోర్టులో అతనిపై జరిపిన తూతూమంత్రం విచారణను ఇండియా తెగనాడింది. నేవీ నుంచి రిటైరయిన తర్వాత జాదవ్ వ్యాపారం పని మీద ఇరాన్ వెళ్లినపుడు పాకిస్థాన్ అతనిని కిడ్నాప్ చేసి బెలూచీస్థాన్లో అరెస్టు చేసినట్లు బుకాయిస్తున్నదని భారత్ వాదిస్తున్నది.