అమరావతి: కృష్ణానది కరకట్టపై ఉన్న కట్టడాల వ్యవహారం గురువారం శాసనసభలో రభసకు దారి తీసింది. సుప్రీం కోర్టు తీర్పు ఉన్నప్పటికీ తాను అడిగానన్న ఒక్క కారణంతో ప్రజావేదికను కూల్చేశారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. అక్రమ కట్టడంలో ఉండడమే కాక ఇంకా సమర్ధించుకుంటున్న చంద్రబాబుకు జ్ఞానం లేదని ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. అక్రమ కట్టడాలన్నీ ముమ్మాటికీ కూల్చివేస్తామని ప్రభుత్వం ఆ సందర్బంగా స్పష్టం చేసింది.
సుప్రీం కోర్టు తీర్పు ఉంటే మరి అర్ధరాత్రి హైకోర్టు తలుపులు తట్టినపుడు వారు స్టే ఎందుకు ఇవ్వలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి నివాసాన్నే కూల్చివేస్తే ఇక సామాన్యుల గతేంటన్న భయంలో ప్రజలు ఉన్నారనీ, ప్రభుత్వం ఇలా వ్యవహరించడం సరి కాదనీ చంద్రబాబు అన్నారు.
నిబంధనల ప్రకారం అన్ని అక్రమ కట్టడాలనూ తొలగించాలంటే రాష్ట్రంలో ఎక్కడంటే అక్కడ అక్రమంగా నెలకొల్పిన వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాల సంగతి ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. దీనితో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. చర్చను పక్కదారి పట్టిస్తున్నారంటూ వైసిపి సభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి, అంబటి రాంబాబు చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు.
అక్రమ కట్టడాలతో నదీ ప్రవాహాన్ని అడ్డుకుంటున్నారని సిఎం అన్నారు. సామాన్యుడికి ఒక రూల్, అధికారంలో ఉన్న వారికి మరో రూల్ ఉండదని జగన్ అన్నారు. 40ఏళ్ల అనుభవం అని చెప్పుకునే వారు ఇతరులకు రోల్ మోడల్గా ఉండాలి తప్ప అక్రమ నిర్మాణాలను సమర్థించడం ఏమిటని జగన్ ప్రశ్నించారు.
ప్రజావేదికతోనే అక్రమ నిర్మాణాల తొలగింపుకు శ్రీకారం చుట్టామనీ, ఎక్కడ అక్రమ కట్టడాలు ఉన్నా తొలగించాలని కలెక్టర్లకు కూడా ఆదేశాల ఇచ్చామని జగన్ అన్నారు. ఈ వ్యవస్థను బాగు చేయాలని ఒక ప్రయత్నం చేస్తుంటే దాన్ని కూడా అడ్డుకుంటున్నారని జగన్ అన్నారు. ఇలా చేస్తే ఈ వ్యవస్థ ఎన్నటికీ బాగుపడదన్నారు.
దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ తాను అడిగినందుకే ప్రజావేదిక కూల్చివేశారనీ అన్నారు. అధికారంలో ఉన్న వారు భవన నిర్మాణ రూల్స్, గతంలో సుప్రీం కోర్టు ఇచ్చి తీర్పులను పరిశీలన చేయాల్సి ఉంటుందని చంద్రబాబు అన్నారు. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం భవన నిర్మాణాలను రెగ్యులరైజ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. తాను ఉంటున్న నివాసాన్ని ఖాళీ చేయడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదనీ, తాను తాత్కాలికంగా అద్దెకే ఉంటున్నానని చంద్రబాబు అన్నారు. తాను ఎక్కడ అక్రమ నిర్మాణం చేపట్టలేదు. తనకు అసైన్మెంట్ భూములు లేవని చంద్రబాబు అన్నారు.
దీనిపై అధికార విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాదోపదాలు నెలకొనడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఇరువర్గాలు సమన్వయంతో సభా సాంప్రదాయాలు పాటించాలని ఆదేశించారు. ముందుగా మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ 30మంది అక్రమ నిర్మాణదారులకు నోటీసులు జారీ చేసినట్లు సభలో ప్రకటించారు.