న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియాలో కేసులో కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి మరోసారి ఢిల్లీ కోర్టు జ్యూడీషియల్ కస్టడీని పొడిగించింది. దీంతో అక్టోబర్ 3వ తేదీ వరకు చిదంబరం తీహార్ జైలులోనే ఉండనున్నారు. చిదంబరం జ్యూడీషియల్ కస్టడీ ఇవాళ్టితో ముగిసింది. దీంతో సీబీఐ అధికారులు ఆయనను న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. చిదంబరం తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నారని ఆయన తరఫు న్యాయవాది కపిల్ సిబల్ అన్నారు. జైలు గది వెలుపల చిదంబరం ఉపయోగిస్తున్న కుర్చీలు, దిండులను తీసేశారని, ఫలితంగా ఆయనకు వెన్నునొప్ప సమస్య ఎక్కువైందన్నారు. చిదంబరం వయస్సు, అనారోగ్య కారణాలను దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని కపిల్ సిబల్ కోరారు.
విచారణ కొనసాగిన కాలంలో చిదంబరం ఆరోగ్యం క్షీణించిందని, ఆయన గణనీయంగా బరువు తగ్గారని తెలిపారు. అధిక రక్తపోటు, మధుమేహంతో పాటు కంటి చూపు సైతం మందగించిందని అన్నారు. జైలులో ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఆరోగ్యాన్ని పరీక్షించుకోవడానికైనా అవకాశం కల్పించాలని కోరారు. సీబీఐ తరఫు న్యాయవాది, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. చిదంబరం కస్టడీని పొడిగించాలని కోరారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి..చిదంబరం జ్యూడీషియల్ కస్టడీని మరో 14 రోజులకు పొడిగిస్తున్నట్లు తెలిపారు.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆగస్టు 21న చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సీబీఐ కస్టడీలో ఉన్న ఆయనను..సెప్టెంబర్ 5న ట్రయల్ కోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో చిదంబారాన్ని తీహార్ జైలుకు తరలించారు. అయితే, తీహార్ జైలులో ఉన్న ఆయనకు రెగ్యులర్ మెడికల్ చెక్అప్, పుడ్ డైట్ ఇవ్వాలని కపిల్ సిబల్ కోర్టును కోరారు. 73 ఏళ్ల వయసు ఉన్న ఆయన వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆయన కోర్టుకు వివరించారు. మరోవైపు ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని ఇప్పటికే చిదంబరం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అంతేకాక ఈ కేసులో తనను జ్యూడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సెప్టెంబర్ 11న మరో పిటిషన్ దాఖలు చేశారు.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ ముందు ఇంద్రాణి ఇచ్చిన వాంగ్మూలమే చిదంబరం అరెస్టుకు దారి తీసింది. ఐఎన్ఎక్స్ మీడియాకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్ఐపీబీ) ద్వారా నిధుల్ని మళ్లించేందుకు బదులుగా తన కుమారుడు కార్తీ చిదంబరానికి సహాయం చేయాలని చిదంబరం తనను, తన భర్త పీటర్ ముఖర్జియాను కోరినట్టు ఇంద్రాణీ ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. దీంతో ఈ కేసులో చిదంబరాన్ని సీబీఐ అధికారులు ఆగస్టు 21న అరెస్టు చేశారు.
ఐఎన్ఎక్స్ మీడియా స్కాంలో ఇంద్రాణీ, ఆమె రెండో భర్త పీటర్ ముఖర్జీ సహ నిందితులు. ఆ మీడియా సంస్థ స్థాపకులు కూడా వీరే. చిదంబరం కుమారుడు కార్తి, పీటర్ కు వ్యాపార సలహాదారుడు. చిదంబరం కేంద్ర మంత్రిగా ఉండడం, కార్తి తమకు సలహాదారుడు కావడంతో ఈ పరిచయాన్ని అడ్డం పెట్టుకుని ఇంద్రాణీ చక్రం తిప్పింది. ఐఎన్ఎక్స్లో 26 శాతం వాటా అమ్మకానికి అనుమతి కోరుతూ ఎఫ్ఐపీబీకి దరఖాస్తు చేసింది. కానీ ఆమె దరఖాస్తును ఎఫ్ఐపీబీ తిరస్కరించింది. చిదంబరం కూడా రూ 4.62 కోట్లరూపాయల వాటా అమ్మకానికే అనుమతినిచ్చారు. ఈ సమయంలో కార్తితో ఇంద్రాణీ వ్యవహారం నడిపించేందుకు స్కెచ్ వేసింది. దీంతో కార్తి ఆమెతో బేరానికి దిగాడు. ‘విదేశాల్లోని తన సంస్థలకు చెల్లింపుల్లో సాయపడితే ఆమె డీల్ ఓకే చేయిస్తాననడంతో ఇంద్రాణీ, పీటర్ ఒప్పుకున్నారు. దీంతో మనీ లాండరింగ్ ద్వారా దాదాపు రూ. 300 కోట్ల మేర చెల్లింపులు జరిగినట్లు ఐటీ శాఖ గుర్తించింది. తర్వాత కార్తిని, ఇంద్రాణీ ఓ స్టార్ హోటల్లో కలిసింది. ఈ వ్యవహారానికి సంబంధించి 10 లక్షల డాలర్ల చెల్లింపులకు చర్చలు జరగ్గా రూ 3.5 కోట్ల చెల్లింపునకు ఒప్పందం కుదిరింది. ఈ కేసులో అరెస్టయ్యాక ఇంద్రాణీ అప్రూవర్గా మారి ఈ వివరాలన్నింటినీ బయట పెట్టేయడంతో చిదంబరం, ఆయన కుమారుడు చుట్టూ ఉచ్చు బిగుసుకుంది.