అమరావతి: రాయలసీమ ప్రాంత ప్రజలు ఇప్పటికీ తెలంగాణలో కలవాలని కోరుకుంటున్నారని కర్నూల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత, పాణ్యం వైసిపి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రాయల తెలంగాణ’ ఏర్పడి ఉంటే రాయలసీమలో మార్పు వచ్చి ఉండేదని కాటసాని అభిప్రాయం వ్యక్తం చేశారు. బైరెడ్డి పాదయాత్ర వల్ల ‘రాయల తెలంగాణ’ ఆగిపోయిందని కాటసాని అన్నారు. ఇప్పటికీ రాయలసీమ ప్రజలు తెలంగాణలో కలవాలనే ఆకాంక్షిస్తున్నారని కాటసాని చెప్పుకొచ్చారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నారని కాటసాని అన్నారు. గోదావరి, కృష్ణానదులు అనుసంధానం చేస్తే రెండు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని కాటసాని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తరవాత కూడా రాయలసీమకు అన్యాయమే జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.