అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేటి నుండి పార్టీ ముఖ్యనేతలతో సమావేశాలను నిర్వహించనున్నారు. పార్టీ క్యాడర్ను కాపాడుకుంటూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం చేయాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో పలువురు నేతలు ఇతర పార్టీలవైపు చూస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. జనసేన పార్టీ ఒకే ఒక అసెంబ్లీ స్థానం గెలుచుకోగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి చవిచూశారు.
పార్టీ ఓటమికి సిద్ధాంతాలకు కట్టుబడి ఉండటం, ఇతర పార్టీల ప్రలోభాలు, నియోజకవర్గ, గ్రామ స్థాయిలో పటిష్టమైన పార్టీ నిర్మాణాన్ని చేసుకోకపోవడం తదితర కారణాలు ఉన్నాయి. అధికారమే లక్ష్యం కాదనీ, సమాజంలో మార్పు తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతోనే ముందుకు సాగుతామని జనసేన అంటున్నది.
పార్టీలో కీలకంగా పని చేసిన నేతలు శ్రీధర్, రాఘవయ్యలు ఎన్నికల అనంతరం పార్టీకి రాజీనామా చేయగా ఇటీవల మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు పార్టీని వీడి బిజెపిలో చేరారు. రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేసే క్రమంలో భాగంగా ఆ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని ప్రారంభించినది. టిడిపికి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను పార్టీలో చేర్చుకొన్నది. టిడిపితో పాటు జనసేన పార్టీ నాయకులకు సైతం బిజెపి గాలం వేస్తున్నదని సమాచారం. మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కూడా పార్టీ వీడి సొంత గూటికి చేరనున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో పార్టీ క్యాడర్లో ఆత్మవిశ్వాసం నింపి త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం గ్రామ స్థాయి నుండి పార్టీని సమాయత్తం చేసేందుకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలతో చర్చించడంతో పాటు ఇతర పార్టీలవైపు చూస్తున్న నేతలను బుజ్జగించడం ప్రధాన ఎజండాగా ఈ సమావేశాలను నిర్వహించనున్నట్లు తెలుస్తున్నది. 2024 నాటికి పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందన్న ఆశలను పార్టీ శ్రేణులకు కల్పించడమే ఈ సమావేశాల ప్రధాన ఉద్దేశమని భావిస్తున్నారు.