న్యూఢిల్లీ: ఇండియాలో మతస్వేచ్ఛ పరిమితమవుతోందన్న అమెరికా విదేశాంగ శాఖ నివేదికను నరేంద్ర మోదీ ప్రభుత్వం తిరస్కరించింది. అంతర్జాతీయంగా వివిధ దేశాలలో మత స్వాతంత్ర్యం తీరుతెన్నులపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతి ఏటా నివేదిక ఇస్తుంది. అమెరికాలో పరిస్థితిని మాత్రం ఇందులో పరిశీలించరు.
నివేదిక విడుదలయిన వెంటనే అధికారపక్షం అయిన బిజెపి ట్రంప్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్రంప్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని బిజెపి మీడియా వ్యవహారాల ఇన్ఛార్జ్ అనిల్ బలూనీ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు.
ఇండియాలో పింసాయుత తీవ్రవాద హిందూ గ్రూప్లు గత ఏడాది పొడవునా మైనారిటీలపై దాడులు చేస్తూ వచ్చాయని ఆ నివేదికలో పేర్కొన్నారు. గోసంరక్షక దళాల పేరుతో హత్యలకూ, మూక దాడులకూ, వేధింపులకూ పాల్పడినవారిని ప్రాసిక్యూట్ చేయడంలో ప్రభుత్వం చాలా సందర్భాలలో విఫలం అయిందని నివేదికలో ఆరోపించారు.
ఈ నివేదికకు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ స్పందిస్తూ, మా దేశంలో రాజ్యాంగబద్ధంగా పరిరక్షితమైన మైనారిటీల హక్కుల తీరుతెన్నులపై ఓ విదేశీ యంత్రాంగం చేసే వ్యాఖ్యలకి విలువ ఇవ్వాల్సిన పని లేదు అని పేర్కొన్నారు. ఇండియాలో మైనారిటీల మత స్వాతంత్ర్యానికి రాజ్యాంగం రక్షణ కల్పిస్తుందనీ, పరమత సహనం విషయంలో ఇండియా చరిత్ర అందరికీ తెలుసుననీ ఆయన వ్యాఖ్యానించారు.