(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్టు నియామకాలు వివాదంగా మారే సూచనలు కనబడుతున్నాయి. బిజెపి ఇప్పటికే విమర్శలు ఎక్కుపెట్టింది. టిటిడి పునరావాస కేంద్రంగా మారిందన్నది ఆ పార్టీ ప్రధాన ఆరోపణ.
24 మందిని టిటిడి ట్రస్టు బోర్డులో సభ్యులుగా నియమిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరుసటి రోజు మరో ఏడుగురిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించింది. వీరికి ఓటు హక్కు ఉండదు కానీ, సభ్యుల మాదిరే ప్రొటోకాల్ వర్తిస్తుంది.
ఇంత భారీ సైజులో టిటిడి ధర్మకర్తల మండలి నియామకం కావడం ఇదే మొదటిసారి. తెలంగాణా నుంచి పెద్ద సంఖ్యలో బోర్డులోకి తీసుకోవడం కూడా మొదటిసారే. ఎనిమిది మంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండగా ఏడుగురిని తెలంగాణ నుంచి ఎంపిక చేశారు. మరో నలుగురిని కర్నాటక నుంచి, ముగ్గురిని తమిళనాడు నుంచి, ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి ఒక్కరు చొప్పున ట్రస్టు బోర్డులోకి తీసుకున్నారు.
నిజానికి ఇప్పుడు బోర్డులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న ఎనిమిది మంది సభ్యులు మైనారిటీ. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి నామినేట్ అయిన వారి సంఖ్య 16. తెలంగాణా నుంచి పెద్ద సంఖ్యలో ట్రస్టు బోర్డులోకి తీసుకోవడంపై ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగుదేశం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అన్ని పరిశ్రమల్లోనూ 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలన్న జగన్ ప్రభుత్వానికి టిటిడి బోర్డు దగ్గరకు వచ్చేసరికి ఆ సంగతి గుర్తు రాలేదా అంటూ టిడిపి వ్యాఖ్యానించింది. దేవాలయాల ధర్మకర్తల మండళ్లలో 50 శాతం మహిళలకు రిజర్వు చేసిన వైసిపి ప్రభుత్వం ఆ విషయంలో టిటిడికి మాత్రం మినహాయింపు ఇచ్చింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఉన్న క్విడ్ ప్రోకో అభియోగాల కేసుల్లో సహ నిందితులైన ఇండియా సిమెంట్స్ ఆధినేత ఎస్. శ్రీనివాసన్, హెటిరో గ్రూప్ ఛైర్మన్ బి. పార్ధసారధి రెడ్డి ట్రస్టు బోర్డులో చోటు సంపాదించారు. శ్రీనివాసన్ ట్రస్టు బోర్డుకు నామినేట్ కావడం ఇది వరసగా అయిదోసారి. వివాదాస్పద చెన్నై వ్యాపారవేత్త శేఖర్రెడ్డికి మళ్లీ ట్రస్టు బోర్డులో చోటు కల్పించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్కు సన్నిహితుడైన మైహోం రామేశ్వరరావు, కెసిఆర్ కుటుంబానికి చెందిన నమస్తే తెలంగాణ మీడియా గ్రూప్ మేనేజింగ్ డైరక్టర్ డి. దామోదర రావు కూడా ట్రస్టు బోర్డులో సభ్యులయ్యారు.
బిజెపి విమర్శించిందని కాదు కానీ ఈ ట్రస్టు బోర్డు నియామకాలు చూస్తే టిటిడి పాలకమండలిలో సభ్యత్వం పొందేందుకు అర్హత ఏమిటో తేలికగానే అర్ధం అవుతుంది. పారిశ్రామికవేత్తలు, రాజకీయనాయకులు, రాజకీయ పలుకుబడి కలవారు, పాలకపక్షానికి దగ్గరగా ఉన్నవారు. గతంలో పరిస్థితి దీనికి భిన్నం కాదు కానీ జంబో బోర్డు రావడం ఇదే మొదటిసారి. ఎక్కువమందిని సంతృప్తి పరచడానికే ముఖ్యమంత్రి జగన్ ఈ జంబో ట్రస్టు బోర్డు ఏర్పాటు చేశారని తెలిసిపోతున్నది. గతంలో టిడిడి ఇవోగా ఒకసారి పని చేసిన మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఇంతమంది సభ్యులను మేనేజ్ చేయడం తలకు మించిన బారం అవుతుందని వ్యాఖ్యానించారు. నిజానికి టిటిడి నిర్వహణలో వీరి పాత్ర ఏమాత్రం ఉండదు. ఇవో, జెఇవోల నేతృత్వంలో టిటిడి యంత్రాంగం మొత్తం వ్యవహారాలను చక్కదిద్దుతుంది. విధాన నిర్ణయాలు కూడా చాలావరకూ వారే సూచిస్తారు. బోర్డు పని మమ అనడం వరకే. ట్రస్టు బోర్డు ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి నియామకం తర్వాత మూడు నెలలకు వచ్చిన ఈ మండలి టిటిడి ప్రతిష్టను పలచన చేసిందన్న విమర్శలో కొంత నిజం లేకపోలేదు.