సీజేఐ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు
జస్టిస్ బాబ్డేను కలిసిన మరో న్యాయమూర్తి
ఫుల్ కోర్టును సమావేశపరచాలని డిమాండు
లేఖలో అంశాలు ప్రస్తావించిన జస్టిస్ చంద్రచూడ్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరుపుతున్న జస్టిస్ బాబ్డేని మరోన్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కలిశారు. మే 2వ తేదీన ఆయనను కలిసి, లేఖలో అంశాలపై చర్చించినట్లు ద ఇండియన్ ఎక్స్ ప్రెస్ తన కథనంలో పేర్కొంది. ఫిర్యాదు చేసిన మహిళ విచారణ నుంచి వైదొలగేందుకు దారితీసిన అంశాలన్నింటినీ పరిష్కరించాలని ఆ లేఖలో ఉంది. త్రిసభ్య ధర్మాసనానికి మే 2వ తేదీన రాసిన లేఖలో.. తాను లేవనెత్తిన అంశాలపై చర్చించేందుకు ఫుల్ కోర్టును సమావేశపరచాలని జస్టిస్ డీవై చంద్రచూడ్ డిమాండ్ చేశారు. ఆ లేఖలోని అంశాలపై చర్చించేందుకే జస్టిస్ బాబ్డేను ఆయన కలిశారు.
ధర్మాసనంలోకి ఒక బయటి వ్యక్తిని కూడా చేర్చుకోవాలన్న అంశంపై లేఖలో ప్రస్తావన ఉండటంతో పాటు.. సుప్రీంకోర్టులో పదవీ విరమణ చేసిన ముగ్గురు న్యాయమూర్తుల పేర్లను కూడా సూచించారు. వాళ్లు జస్టిస్ రుమా పాల్, సుజాతా మనోహర్, రంజనా దేశాయ్. జస్టిస్ చంద్రచూడ్ రాసినది కేవలం వ్యక్తిగత లేఖ కాదని, సుప్రీంకోర్టులోని కొందరు న్యాయమూర్తుల అభిప్రాయమని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. 17 మందికి పైగా న్యాయమూర్తులతో చర్చించిన తర్వాతే ఆ లేఖ రాశారు. సుప్రీంకోర్టులో సీజేఐ, ధర్మాసనంలోని ముగ్గురు, ధర్మాసనం నుంచి తప్పుకొన్న జస్టిస్ ఎన్వీ రమణ కాక 22 మంది జడ్జీలున్నారు.
సుప్రీంకోర్టు పరువు ప్రతిష్ఠల విషయంలో ఎంతో ముఖ్యమైనవి, కొన్ని ప్రాథమిక అంశాలను జస్టిస్ చంద్రచూడ్ తన లేఖలో ప్రస్తావించారు. తామంతా నిష్పక్షపాతంగా, సదాలోచనలతో ఉంటామనే ప్రజలు తమపై నమ్మకం ఉంచుతారనన వాస్తవాన్ని విచారణ కమిటీ గుర్తెరగాలని లేఖలో ప్రస్తావించారు. అయితే.. విచారణ సమయంలో తన న్యాయవాదిని అనుమతించలేదని, కమిటీ విచారణను ఆడియో, వీడియో రికార్డింగు చేయనివ్వడం లేదని, తన వాంగ్మూలం కాపీ ఇవ్వలేదని, విచారణ క్రమం గురించి తనకు తెలియజేయడం లేదన్న కారణాలతోనే బాధితురాలు విచారణ నుంచి తప్పుకొన్నారు. తాను విచారణ నుంచి బలవంతంగా తప్పుకోవాల్సి వచ్చిందని ఆమె చెప్పారు. బాధితురాలిని విచారించేటపుడు ఆమె తరఫు న్యాయవాది ఉండటానికి తిరస్కరించడం స్వేచ్ఛాయుత విచారణను ఉల్లంఘించడమే అవుతుందని తన లేఖలో జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. ఆమె గౌరవ మర్యాదలను రక్షించాల్సిందేనని చెప్పారు. న్యాయవాదిని అందించడం అనేది గౌరవం కాదని, ఫిర్యాదుచేసినవారి హక్కని ఆయన తెలిపారు.
ఇన్-హౌస్ విచారణ తీరుపై స్పష్టత ఇవ్వాలని కూడా జస్టిస్ చంద్రచూడ్ తన లేఖలో కోరారు. సీజేఐ మీద విచారణలో ఎంఓపీ ప్రస్తావన లేదని, మరి అలాంటప్పుడు ఈ విచారణ ఎంఓపీ కింద జరుగుతోందని ఎలా చెబుతారని ప్రశ్నించారు. తన వాంగ్మూలం కాపీ ఇవ్వాలని ఫిర్యాదు చేసిన మహిళ కోరినపుడు దాన్ని విచారణ కమిటీ నిరాకరించడానికి వీల్లేదని కూడా లేఖలో చెప్పారు. త్రిసభ్య ధర్మాసనం నిష్పాక్షితపై విశ్వాసాన్ని వ్యక్తంచేశారు. అదే సమయంలో ఎమికస్ క్యూరీని నియమించాలని కూడా ఆయన కోరారు. ఈ కేసులో కమిటీకి సహకరించేందుకు బార్ నుంచి ఒక సీనియర్ మహిళా న్యాయవాదిని సూచించారు.
‘ఇద్దరు’ కలవడం తప్పు
జస్టిస్ బాబ్డేను ఇద్దరు న్యాయమూర్తులు కలిసిననట్లు వచ్చిన కథనాలు తప్పని సుప్రీంకోర్టు ఖండించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ డీవై చంద్రచూడ్ లు జస్టిస్ బాబ్డేను కలిసి తమ అభిప్రాయాలను వెల్లడించినట్లు పత్రికలలో వచ్చిన కథనాలను కోర్టు ఖండించింది. ఇద్దరూ కలిసి రాలేదని తెలిపింది. అంతేతప్ప.. జస్టిస్ చంద్రచూడ్ ఒక్కరే వచ్చారన్న విషయాన్ని మాత్రం ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం.