అమరావతి: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అన్నది అందరికీ తెలిసిందే. అయితే సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన పరిణామాలు చూసుకున్నట్లయితే టిడిపి అధినేత చంద్రబాబు ఏకాకి అవుతున్నట్లుగా కనబడుతోంది. ఎన్నికల ముందు వరకూ యుపిఎలో భాగస్వామ్యంగా ఉండి చంద్రబాబు సన్నిహితంగా ఉన్న పొరుగు రాష్ట్రాల నేతలు ఒక్కరొక్కరుగా వైసిపి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి దగ్గర అవుతున్న సూచనలు కనబడుతున్నాయి.
సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలోని 25 పార్లమెంట్ స్థానాల్లో 22 స్థానాలు వైసిపి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. టిడిపి కేవలం మూడు స్థానాలకే పరిమితం అయ్యింది. అదే విధంగా అసెంబ్లీ స్థానాల విషయంలోనూ అనూహ్యంగా 151 స్థానాలను వైసిపి గెలుచుకోగా టిడిపి 23 స్థానాలకే పరిమితం అయ్యింది.
ఈ నేపథ్యంలో ఇటీవల కాలం వరకూ చంద్రబాబుతో సన్నిహితంగా ఉన్న తమిళనాడుకు చెందిన డిఎంకె నేత స్టాలిన్, కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామిలు ఆయన ప్రత్యర్థి వైఎస్ జగన్మోహనరెడ్డికి సన్నిహితులవుతున్నట్లుగా సూచనలు కనబడుతున్నాయి. ఎన్నికల ముందు నుండి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ జగన్మోహనరెడ్డితో సన్నిహితంగా ఉన్న విషయం తెలిసిందే. జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్తో పాటు డిఎంకె నేత స్టాలిన్ కూడా హజరైన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారం తరువాత తాడేపల్లిలోని జగన్మోహనరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు సైతం వీరిద్దరు హజరయ్యారు. నాడు రాష్ట్రానికి వచ్చిన స్టాలిన్ ఎన్నికల్లో ఓటమి భారంతో ఉన్న చంద్రబాబును పలకరించకుండానే వెళ్లిపోయారు.
తాజాగా శనివారం ఢిల్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి హజరయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై కూడా వీరు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు చూస్తుంటే టిడిపి అధినేత చంద్రబాబుకు పాత స్నేహితులు దూరం అవుతున్నట్లు కనబడుతోంది.