బెంగళూరు: కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉపఎన్నికలపై విపక్ష కాంగ్రెస్ దృష్టి సారించింది. అధికార బీజేపీని ఉపఎన్నికల్లో మట్టికరిపించేందుకు కాంగ్రెస్ నేతలు పథక రచన చేస్తున్నారు. కాంగ్రెస్, జేడీఎస్కు చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలతో ఖాళీ అయిన 15 అసెంబ్లీ నియోజవర్గాల్లో డిసెంబర్ 5న ఉపఎన్నికలు నిర్వహించనుంది ఈసీ. ఈ నేపథ్యంలో తమ సిట్టింగ్ స్థానాలను మళ్లీ దక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణను ఆపార్టీ నేతలు రూపొందిస్తున్నారు. మాజీ సీఎం సిద్ధరామయ్య, మాజీ మంత్రి హెచ్సీ మహదేవప్ప, ఎమ్మెల్సీ రిజ్వాన్ అర్షద్లు మాజీ ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వర్ నివాసంలో సమావేశమై పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఉప ఎన్నికలు జరుగనున్న మొత్తం 15 నియోజకవర్గాల్లోనూ పార్టీని బలోపేతం చేసి, తద్వారా బీఎస్ యడియూరప్ప సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించారు. పరమేశ్వర్ ఆస్తులపై ఆదాయం పన్ను శాఖ దాడుల అనంతరం కాంగ్రెస్ కీలక నేతలంతా సమావేశం కావడం ఇదే ప్రథమం.
కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, మాజీ మంత్రి డీకే శివకుమార్ ఇప్పటికే బెయిల్ పై విడుదల అయ్యారు. సుమారు 50 రోజుల పాటు తీహార్ జైలులో విచారణ ఖైదీగా శిక్ష అనుభవించిన శివకుమార్కు శనివారం బెంగళూరులో ఘనస్వాగతం లభించింది. ఆయన నేరుగా కర్ణాటక కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టి.. బీజేపీపై విమర్శలకు పదును పెట్టాలని ఆపార్టీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం.
కాంగ్రెస్- జేడీఎస్ ల సంకీర్ణ ప్రభుత్వంలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా చోటుచేసుకున్న నాటకీయ పరిణామాల క్రమంలో అప్పటి స్పీకర్ రమేశ్ కుమార్ 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. దీంతో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. ఎన్నికల సంఘం తొలుత ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం అక్టోబరు 21వ తేదీన 15 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ – జేడీఎస్కు చెందిన 17 మంది ఎమ్మెల్యేల అనర్హత కేసు సుప్రీంకోర్టులో ఉంది. తీర్పు వచ్చే వరకు ఎన్నికలను వాయిదా వేయాలని అనర్హత ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదులు పట్టుబట్టారు. ఫలితంగా ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు సూచించింది. దీంతో డిసెంబర్ 5వ తేదీకి ఎన్నికల నిర్వహించనుంది ఈసీ. 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగనున్నాయి. డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు.