(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అందాల నటి శ్రీదేవి మరణించి సంవత్సరం దాటింది. ఆమె దుబాయిలో ప్రమాదవశాత్తూ స్నానాల తొట్టిలో మునిగి చనిపోయినపుడు చాలా రకాల పుకార్లు చలామణీలోకి వచ్చాయి. అది ప్రమాదం కాదనీ శ్రీదేవిని హత్య చేశారనీ చాలామంది అభిప్రాయపడ్డారు. ఆమె మృతదేహం ఇండియాకు రావడంలో జాప్యం కారణంగా కూడా రకరకాల ఊహాగానాలు బయటకు వచ్చాయి.
తాజాగా ఒక పోలీసు ఉన్నతాధికారి కూడా శ్రీదేవిని ఎవరన్నా హత్య చేసి ఉండవచ్చని అంటున్నారు. తన మిత్రుడు ఫోరెన్సిక్ నిపుణుడు డాక్టర్ ఉమాదతన్ ద్వారా తనకు ఈ విషయం తెలిసినట్లు కేరళ పోలీసు డైరక్టర్ జనరల్ (జైళ్లు) రిషిరాజ్ సింగ్ కేరళ కౌముది పత్రికలో రాశారు. విశేషం ఏమంటే ఆ డాక్టర్ ఉమాదతన్ ఇప్పుడు జీవించిలేరు.
శ్రీదేవి భర్త, బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ రిషిరాజ్ సింగ్ రాతలను ఖండించారు. ఇట్లాంటి పిచ్చి కథనాలు వస్తుంటాయి. వాటిపై స్పందించడం కూడా అనవసరం అని ఆయన ఇన్.కాం వెబ్సైట్తో అన్నారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో బంధువుల వివాహానికి దుబాయి వెళ్లిన శ్రీదేవి హోటల్ గదిలో మద్యం సేవించిన తర్వాత స్నానాల తొట్టిలో మునిగి మరణించారు. ఇది ప్రమాదవశాత్తూ సంభవించిన మరణంగా అక్కడి పోలీసులు తేల్చారు.
కుతూహలం కొద్దీ తాను అడిగినపుడు శ్రీదేవి మృతి ప్రమాదవశాత్తూ జరిగుండకపోవచ్చని డాక్టర్ ఉమాదతన్ చెప్పినట్లు రిషిరాజ్ సింగ్ రాశారు. ఎంత ఎక్కువ మద్యం సేవించినా అడుగు లోతు నీరున్న బాత్ టబ్లో ఎవరూ మునగరని ఆయన చెప్పినట్లు రిషిరాజ్ పేర్కొన్నారు. ఎవరన్నా రెండు కాళ్లూ గట్టిగా పట్టుకుని తలను బలవంతంగా నీటిలో ముంచినపుడే మరణించడం జరుగుతుంది అని ఆ వైద్యుడు చెప్పినట్లు ఆయన రాశారు. అయితే దీనిని నిర్ధారించేందుకు మార్గం ఎంత వెదికినా దొరకలేదని ఇండియా టుడే వెబ్సైట్ పేర్కొన్నది.