అమరావతి: రాత్రి 10:00గంటలు: ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ సునామీకి ప్రత్యర్థి పార్టీలు చిత్తు అయ్యాయి. మొత్తం 175 స్థానాలకు 150 స్థానాలు వైసిపి కైవశం చేసుకోగా టిడిపి 23 స్థానాలలోనే విజయం సాధించింది. జనసేన ఒక స్థానంలో గెలుపొందింది. విశాఖ సౌత్ స్థానంపై ఫలితం ప్రకటించాల్సి ఉంది.
సాయంత్రం 6:47 గంటలు: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఇప్పటికి ఫలితాలు ప్రకటించిన స్థానాలలో వైసిపికి 86 స్థానాలు దక్కాయి. ఆ పార్టీ ఇంకా 63 స్థానాలలో ఆధిక్యతలో ఉంది. టిడిపి అభ్యర్దులు 14 సీట్లలో విజయం సాధించారు. మరో 11 స్థానాలలో ఆ పార్టీ అభ్యర్ధులు ఆధిక్యతలో కొనసాగుతున్నారు.
పార్లమెంటు స్థానాల దగ్గరకు వచ్చేసరికి విజయవాడ, గుంటూరు స్థానాలలో టిడిపి అభ్యర్ధులు కేశినేని నానీ, గల్లా జయదేవ్ విజయం సాధించారు. శ్రీకాకుళం నియెజకవర్గంలో కింజరపు రామ్మోహన్ నాయుడు ఆధిక్యతలో ఉన్నారు.
కడప, రాజంపేట, తిరుపతి, చిత్తూరు నియోజకవర్గాలలో వైసిపి అభ్యర్ధులు విజయం సాధించారు. మిగతా 18 నియోజకవర్గాలలోనూ వైసిపి అభ్యర్ధులే ముందంజలో ఉన్నారు.
4:30 గంటలు: ఆంధ్రప్రధేశ్లో వైసిపి ప్రభంజనం కొనసాగుతోంది. 175 స్థానాలకు గానూ ఇప్పటికే 45 స్థానాల్లో విజయం సాధించగా 108 స్థానాల్లో ఆధిక్యత కొనసాగిస్తోంది. టిడిపి ఇప్పటి వరకూ మూడు స్థానాల్లో మాత్రమే విజయం సాధించగా 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జనసేన ఒక స్థానంలో ఆధిక్యత కొనసాగిస్తోంది.
కుప్పంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గెలుపొందగా, పులివెందుల నుండి వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి 90,593 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు.
1;12 గంటలు: వైసిపి ఫ్యాన్ ఆంధ్రప్రదేశ్లో సునామీ సృష్టించింది. మొత్తం 175 స్థానాలకు గాను 152 సీట్లలో వైసిపి ఆధిక్యంలో ఉంది. మిగిలిన 23 స్థానాలో టిడిపి ఆధిక్యంలో ఉంది. జనసేన ఒక్క సీటులో కూడా అధిక్యత కనబరచడం లేదు. పోటీ చేసిన రెండు స్థానాల లోనూ పవన్ కల్యాణ్ వెనుకబడి ఉన్నారు.
ఇక లోక్సభ స్థానాలయితే టిడిపి ఒక్క దానిలో కూడా ఆధిక్యతలో లేదు మొత్తం 25 సీట్లలోనూ వైసిపి అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు.
11:07 గంటలు: మంత్రులు లోకేష్, ప్రత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాస రావు, చినరాజప్ప, కాల్వ శ్రీనివాసులు, దేవినేని ఉమ వెనుకంజలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గాజువాకలో కాస్త పుంజుకున్నారు. మొత్తం 175 సీట్లలో 145 స్థానాలలో వైసిపి అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు. టిడిపి 29 స్థానాలలో జనసేన ఒక్క సీటులో ముందంజలో ఉన్నాయి.
10:33 గంటలు: వైసిపి ఆధిక్యతలు పెరుగుతూనే ఉన్నాయి. ఎక్కువ జిల్లాలలో ఏకపక్షంగా వైసిపికి వోటర్లు పట్టం కట్టినట్లు తెలుస్తోంది. కడపలో మొత్తం 9 సీట్లలోనూ వైసిపి అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు. గుంటూరు జిల్లాలో 12 సీట్లలో వైసిపి, 5 సీట్లలో టిడిపి ఆధిక్యత కనబరుస్తోంది.
తూర్పు గోదావరి జిల్లాలో 10 సీట్లలో వైసిపి, 8 సీట్లలో టిడిపి, రెండు సీట్లలో జనసేన ముందంజలో ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో 13 సీట్లలో వైసిపి, ఒక్క స్థానంలో టిడిపి ముందంజలో ఉన్నాయి. కృష్ణా జిల్లాలో 11 సీట్లు వైసిపి, 5 సీట్లు టిడిపి ఆధిక్యత దిశగా ఉన్నాయి.
నెల్లూరు జిల్లాలో పది సీట్లలోనూ వైసిపి అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు. కర్నూలు జిల్లాలో 12 సీట్లు వైసిపి పక్షాన, రెండు సీట్లు టిడిపి పక్షాన కనబడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 8 సీట్లు వైసిపి పక్షాన, రెండు సీట్లు టిడిపి పక్షాన నడుస్తున్నాయి. విశాఖ జిల్లాలో 10 సీట్లలో వైసిప, 5 స్థానాలలో టిడిపి ముందంజలో ఉన్నారు.
పశ్చిమ గోదావరిలో 13 సీట్లులో వైసిపి, రెండు సీట్లలో టిడిప ఆధిక్యత కనబరుస్తున్నాయి. విజయనగరం జిల్లాలో తొమ్మిదికి తొమ్మిదీ వైసిపి పక్షాన ఉన్నాయి.
జనసేన నేత పవన్ కల్యాణ్ రోటీ చేసిన రెండు స్థానాలలోనూ వెనుకంజలో ఉన్నారు.
10:00 గంటలు: రాష్ట్రంలో వైసిపి గాలి జోరుగా వీచిందని తేటతెల్లం అయిపోయింది. 118 స్థానాలలో వైసిపి ఆధిక్యతలో ఉంది. పలు జిల్లాలలో వైసిపి క్లీన్ స్వీప్ చేయనున్నట్లు ఆధిక్యతలు సూచిస్తునాయి. ఒద దశలో కుప్పంలో వెనుకబడ్డ చంద్రబాబు మళ్లీ పుంజుకున్నారు. ఆయన కుమారుడు లోకేష్ మంగళగిరిలో వెనుకంజలో ఉన్నారు.
9:30 గంటలు: వైసిపి ఆధిక్యత 91 సీట్లకు పెరిగింది. టిడిపి ఆధిక్యత 21 సీట్లకు పరిమితమైంది. కుప్పంలో ముక్యమంత్రి చంద్రబాబు నాయుడు వెనుకబడ్డారు. అక్కడ వైసిపి 67 వోట్ల స్వల్ప ఆధిక్యతలో ఉంది.
9:00 గంటలు: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో వైసిపి ఆధిక్యత కనబరుస్తోంది. ఉదయం తొమ్మిది గంటలు దాటేసరికి ఆ పార్టీకి 22 స్థానాలలో ఆధిక్యత నమోదయింది. అధికారపక్షమైన టిడిపి 12 స్థానాలలో ఆధిక్యతతో వెనుకబడి ఉంది. జనసేన మూడు నియోజకవర్గాలలో ముందంజలో ఉంది.
ముందు రిపోర్టు: ఆంధ్రప్రదేశ్ ప్రజలను నరాలు తెగే ఉత్కంఠలో దించిన శాసనసభ ఎన్నికలలో వోట్ల లెక్కింపు మొదలయింది. ఎనిమిది గంటలకు మొదలయిన కౌంటింగ్లో గంట గడిచేసరికి 20 నియోజకవర్గాలలో ఆధిక్యతలు బయటకు వచ్చాయి. వాటిలో 9 సీట్లలో అధికార టిడిపి, మరో 9 సీట్లలో ప్రధాన ప్రతిపక్షం వైసిపి ఆధిక్యతలో ఉన్నాయి. జనసేన రండు సీట్లలో ఆధిక్యత కనబరుస్తోంది.