న్యూఢిల్లీ: శనివారం నుంచీ కనబడకుండా పోయిన ఉత్తరప్రదేశ్కు చెందిన న్యాయశాస్త్రం విద్యార్ధిని పోలీసులు సుప్రీంకోర్టు ముందు హాజరు పరిచారు. జస్టిస్ భానుమతి, జస్టిస్ బోపన్న ఆ యువతితో ఆంతరంగికంగా మాట్లాడుతున్నారు.
సుప్రీంకోర్టు ఈ కేసును స్యుమోటోగా విచారణకు స్వీకరించింది. ఇది మరో ఉన్నావ్ కేసు లాగా మారుతుందని కొందరు న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేయడంతో గురువారం సుప్రీంకోర్టు కేసును చేపట్టింది. ఉన్నావ్ సంఘటనలో అత్యాచార బాధితురాలు ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగర్ నుంచి తన ప్రాణానికి ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసింది. ఆ లేఖ ప్రధాన న్యాయమూర్తి చూడకముందే ఆమె ప్రయాణిస్తున్న కారును ఒక లారీ ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఆమె పినతల్లులు ఇద్దరు మరణించారు. బాధితురాలు, ఆమె న్యాయవాది తీవ్రంగా గాయపడ్డారు. ఆమెపై అత్యాచారం చేశాడన్న అభియోగాన్ని ఎదుర్కొంటున్న సెంగర్ బాధితురాలిని అడ్డు తొలగించుకునేందుకు ఈ రోడ్డు ప్రమాదం సృష్టించాడన్నది మరో అభియోగం.
(16 02 గంటలు) అంతకుముందు:
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత స్వామి చిన్మయానంద్పై లైంగిక ఆరోపణలు చేసి అదృశ్యమైన విద్యార్థిని సుప్రీం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. రాజస్థాన్లో విద్యార్థిని ఆచూకీ కనుగొన్నట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు. యువతి క్షేమంగా ఉందన్నారు. ఆమెను ఎవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పారు. విద్యార్థిని అదృశ్యమైన వారం రోజుల తరువాత ఆమె ఆచూకీ లభించింది. ఈ నేపథ్యంలో విద్యార్థిని జాడ ఎక్కడ ఉంది, ఆమెను ఎప్పటి వరకు కోర్టులో హాజరుపరుస్తారో చెప్పాలని సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ కేసు విషయంలో తామే స్వయంగా బాధిత యువతితో మాట్లాడతామని జస్టిస్ భానుమతి, బొప్పన్నలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఇది ఇలా ఉంటే మరో రెండు గంటల్లో విద్యార్థినిని ఢిల్లీకి చేరే అవకాశం ఉంది.
స్వామి చిన్మయానంద్ తనపై తరచూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ న్యాయ విద్యార్థిని ఇటీవల సంచలన ఆరోపణలు చేసింది. తన ఫేస్ బుక్ లో ఓ వీడియోను పోస్ట్ చేసి… అనంతరం అదృశ్యమైంది. స్వామి చిన్మయానంద్ తమ కుమార్తెను కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ.. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చిన్మయానంద్ పై కేసు నమోదు చేశారు.
ఉత్తర్ ప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో స్వామి సుఖదేవానంద న్యాయ కళాశాలలో బాధిత విద్యార్థిని చదువుతోంది. కళాశాలకు చెందిన హాస్టల్ లో ఉంటుంది. చిన్మయానంద్ ఇదే కళాశాలకు డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. నిన్మయానంద్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, తరచూ శారీరకంగా హింసిస్తున్నారని యువతి ఆరోపించింది. తనను రక్షించాలని కోరుతూ ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లకు విన్నవించింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆమెన ఈ నెల 23న తన ఫేస్ బుక్ అకౌంట్ పోస్ట్ చేసింది. అనంతరం కనిపించకుండపోయింది.