ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల రెండవ దశ పోలింగ్ గురువారం చెదురు మదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. కొన్ని చోట్ల ఉద్రిక్తతలు, ఘర్షణలు జరిగాయి.
రెండవ దశ ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్న 95 నియోజకవర్గాల్లో నేడు పోలింగ్ జరిగింది. ఉదయం ఏడు గంటల నుండిసాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్ ప్రక్రియ కొనసాగించారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో గంట ముందుగా నిలుపుదల చేశారు.
కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 10, ఉత్తర్ప్రదేశ్లో ఎనిమిది, అసోం, బిహార్, ఒడిశాల్లో ఐదు సీట్ల చొప్పున, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లలో మూడు సీట్ల చొప్పున, జమ్మూకశ్మీర్లో రెండు సీట్లు, మణిపూర్, పుదుచ్చేరిల్లో ఒక్కో సీటుకు పోలింగ్ జరిగింది.
బెంగాల్లో ఉద్రిక్తత:
ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లోని రాయ్గంజ్ నియోజకవర్గ పరిధిలో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. దినాజ్పూర్ జిల్లా చోప్రాలోని డిగిర్పూర్ పోలింగ్ స్టేషన్లో తమని ఓటు వేయకుండా అడ్డుకున్నారనీ,తృణమూల్ కాంగ్రెస్ నేతలు పోలింగ్ బూత్ను తమ అధీనంలోకి తీసుకున్నారనీ స్థానికులు ఆరోపించారు. 34 వ నంబరు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.పోలీసులు ఆందోళన కారును వారించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోవటంతో లాఠీ చార్జ్ చేశారు. దీంతో కొందరు పాలీసులపై రాళ్లు రువ్వారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. భాష్పవాయువు ప్రయోగించి వారిని చెదరగొట్టారు.
ఇదే రాయ్గంజ్ నియోజకవర్గంలో 112 బూత్ వద్ద తృణమూల్ కాంగ్రెస్, బిజెపి వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో ఈవిఎంలు కూడా ధ్వంసమయ్యాయి. అలాగే ఇదే నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థి మహ్మద్ సలీమ్ కారుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు.
ఛత్తీస్ఘడ్, ఒడిశాలో మావోయిస్టుల ప్రభావం:
ఛత్తీస్ఘడ్ లో మావోయిస్టులు ఎన్నికలను బహిష్కరించారు. ఈ నేపథ్యంలో దౌలికర్క అడవుల్లో మావోయిస్టులు తిరుగుతున్నారన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో అటు మావోయిస్టులు ఇటు పోలీసులకు మధ్య దంతెవాడ ప్రాంతంలో హోరాహోరీ ఎదురుకాల్పులు జరిగాయి. ఒక మావోయిస్టు కమాండర్, మరో మావోయిస్టు ఈ కాల్పుల్లో మృతి చెందారు. మరో మావోయిస్టు తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించారు.
ఒడిశాలో కూడా మావోలు ఎన్నికలను బహిష్కరించారు. అయితే ఎన్నికలను అడ్డుకునేందుకు మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. కంధమాల్ అడవి ప్రాంతంలో పోలింగ్ సిబ్బంది లక్ష్యంగా మందుపాతర పేల్చారు. ఆ దాడిలో పోలింగ్ ఏజెంట్ సంజుక్తా దిగల్ చనిపోయారు. కొంతమందికి గాయాలయ్యాయి.
మండ్యలో ఘర్షణలు:
కర్ణాటకలోని మండ్య లోక్సభ నియోజకవర్గంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. జెడిఎస్ అభ్యర్థి, ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల గౌడ మద్దతుదారులు, స్వతంత్ర అభ్యర్థి, అంబరీశ్ సతీమణి సుమలత మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి సద్దుమణిగింది.
తమిళనాడులో ఒక పోలింగ్ కేంద్రంలో ఎన్నిక వాయిదా:
తమిళనాడు కడలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక పోలింగ్ కేంద్రంలోని ఈవిఎంలో ఎఎంఎంకె (టిటివి దినకరన్ పార్టీ) అభ్యర్థి కాశీ తంగవేల్ పేరు, గుర్తు పక్కన బటన్ లేదు. దీంతో ఓటు వేయడానికి వెళ్లిన వారు దాన్ని గుర్తించి ప్రిసైడింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ విషయం పార్టీ నేతల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో అధికారులు పోలింగ్ను వాయిదా వేశారు.