అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు సోమవారం అమరావతిలో మీడియా సమావేశంలో పాల్గొని హడావుడిగా పశ్చిమ బెంగాల్ రాజధాని కొల్కతా వెళ్లారు. అక్కడ ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో దాదాపు ముప్పావు గంట సేపు మంతనాలు జరిపారు. తర్వాత మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. మమత కూడా తమ సమావేశం ముచ్చట్లు మీడియాతో పంచుకోలేదు.
ఈ ఇద్దరి మధ్యా ఏ విషయంపై చర్చ జరిగింది? మంగళవారం ఢిల్లీలో ఎన్నికల కమిషన్ను కలిసేందుకు రావాల్సిందిగా మమతను చంద్రబాబు కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇంతమాత్రానికి చంద్రబాబు అమరావతి నుంచి కొల్కతా వెళ్లాల్సిన పని లేదు. మరి ఇద్దరి మధ్యా ఏ విషయంపై చర్చ జరిగింది?
హిందుస్తాన్ టైమ్స్ కథనం ప్రకారం ప్రతిపక్షాలన్నీ కలిసి వెంటనే రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ను కలిసి తమను కూటమిగా పరిగణించాల్సిందిగా కోరాలని చంద్రబాబు ప్రతిపాదించారు. అయితే మమత అందుకు సుముఖంగా లేరు. బిజెపికి 200 సీట్లకు మించి రావనీ, ఫలితాల వెల్లడికి ముందే రాష్ట్రపతిని కలవడం వల్ల ఫలితం ఉంటుందనీ చంద్రబాబు భావిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మమత కూడా విశ్వసించడం లేదు గానీ, చంద్రబాబు చెప్పినట్లు ముందే రాష్ట్రపతిని కలవడానికి సిద్ధంగా లేరు.
మెజారిటీ ప్రతిపక్షాలు కూడా ఈ వ్యూహం వల్ల ఫలితం ఉంటుందని విశ్వసించడం లేదు. ఎన్నికల తర్వాతి పొత్తును ఎన్నికల ముందు పొత్తులాగా పరిగణించాల్సిందిగా రాష్ట్రపతిని చాలాముందు కోరి ఉండాల్సిందనీ, ఇప్పుడు చాలా ఆలస్యం అయిందనీ ఒక కాగ్రెస్ నాయకుడు అభిప్రాయపడ్డారు.